![తెల్లాపూర్లో గద్దర్ విగ్రహ ఏర్పాటు అడ్డగింత](https://static.v6velugu.com/uploads/2024/01/public-warship-gaddar-statue-was-stopped-by-police-while-it-was-being-installed_QZq8wOdGLu.jpg)
- హెచ్ఎండీఏ పర్మిషన్ తీస్కోవాలని పోలీసుల సూచన
- డిప్యూటీ సీఎం భట్టి దృష్టికి తీసుకెళ్లిన అఖిలపక్షం నేతలు
రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో గురువారం అఖిలపక్షం నాయకులు ప్రజా యుద్ధనౌక గద్దర్ విగ్రహం ఏర్పాటు చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. సదరు స్థలం హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తుందని, తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. దీంతో కొంతసేపు హైడ్రామా నడిచింది. ఆ వెంటనే వివిధ పార్టీల, యూనియన్ల నాయకులు రామచంద్రాపురం పీఎస్కుచేరుకొని పోలీసులతో మాట్లాడారు.
హెచ్ఎండీఏ ఆఫీసర్ల ఫిర్యాదు మేరకే పనులను అడ్డుకున్నామని, నిబంధనల ప్రకారం పర్మిషన్లు తీసుకొని కార్యక్రమం చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఈ నెల 31న విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించి, దిమ్మెపై విగ్రహం పెడుతుండగా అడ్డుకున్నారు. అయితే పాట కోసం 50 ఏళ్లు జీవితాన్ని ధారబోసిన గద్దర్కు కృతజ్ఞతగా, ఆయన పాటకు పట్టాభిషేకం జరగాల్సిందేనని అఖిలపక్షం నేతలు చెప్పారు.
ఎట్టి పరిస్థితితుల్లో ఈ నెల 31న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరింపజేస్తామని స్పష్టం చేశారు. హెచ్ఎండీఏ అనవసరపు సమస్యలు సృష్టిస్తోందని, విగ్రహ ఏర్పాటు కోసం పాలక మండలి ఎప్పుడో తీర్మానం చేసిందని వివరించారు. ఈ సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో కవి, రచయిత డాక్టర్ పసునూరి రవీందర్, బుచ్చిరెడ్డి, అరుణ్ గౌడ్, దేవేందర్, రవి తదితరులు పాల్గొన్నారు.