వర్షం వచ్చే.. ఫలితం ఆగె.. పంజాబ్‌‌, కోల్‌‌కతా మ్యాచ్‌‌ రద్దు

వర్షం వచ్చే.. ఫలితం ఆగె.. పంజాబ్‌‌, కోల్‌‌కతా మ్యాచ్‌‌ రద్దు

కోల్‌‌కతా: ఐపీఎల్‌‌–18లో పంజాబ్‌‌ కింగ్స్‌‌, కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌ మ్యాచ్‌‌ వరుణుడి ఖాతాలోకి వెళ్లింది. సెకండ్‌‌ ఇన్నింగ్స్‌‌కు భారీ వర్షం అడ్డంకిగా మారడంతో మ్యాచ్‌‌ను రద్దు చేశారు. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్‌‌ కేటాయించారు. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌‌లో.. టాస్‌‌ నెగ్గిన పంజాబ్‌‌ 20 ఓవర్లలో 201/4 స్కోరు చేసింది. ప్రభుసిమ్రన్‌‌ సింగ్‌‌ (49 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 6 సిక్స్‌‌లతో 83), ప్రియాన్షు ఆర్య (35 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 4 సిక్స్‌‌లతో 69) దంచికొట్టారు. 

తర్వాత కోల్‌‌కతా ఒక ఓవర్‌‌లో 7/0 స్కోరు చేసింది. రెహమానుల్లా గుర్బాజ్‌‌ (1 నాటౌట్‌‌), సునీల్‌‌ నరైన్‌‌ (4 నాటౌట్‌‌) క్రీజులో ఉన్నారు. ఈ దశలో మొదలైన వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో ఔట్‌‌ ఫీల్డ్‌‌ చిత్తడిగా మారింది. చివరకు కటాఫ్‌‌ టైమ్‌‌ వరకు వేచి చూసిన అంపైర్లు ఆట సాధ్యం కాదని తేలడంతో మ్యాచ్‌‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 

ఓపెనర్ల జోరు..

ముందుగా బ్యాటింగ్‌‌కు దిగిన పంజాబ్‌‌కు ఓపెనర్లు ప్రియాన్షు ఆర్య, ప్రభుసిమ్రన్‌‌ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. తొలి మూడు ఓవర్లలో నాలుగు ఫోర్లతో ఆర్య టచ్‌‌లోకి రాగా, మధ్యలో ప్రభుసిమ్రన్‌‌ భారీ షాట్లతో రెచ్చిపోయాడు. నాలుగో ఓవర్లో ఆర్య రెండు ఫోర్లు, ప్రభు ఓ సిక్స్‌‌తో 18 రన్స్‌‌ రాబట్టారు. తర్వాతి ఓవర్‌‌లో ప్రభు 4, 6 దంచడంతో పవర్‌‌ప్లేలో పంజాబ్‌‌ 56/0 స్కోరు చేసింది. ఫీల్డింగ్‌‌ పెరిగిన తర్వాత కూడా వీళ్ల జోరు తగ్గలేదు. స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేస్తూ వీలైనప్పుడల్లా బౌండ్రీలు బాదారు. 

తర్వాతి మూడు ఓవర్లలో 18 రన్స్‌‌ వచ్చాయి. 10వ ఓవర్‌‌లో 4, 6, 4 కొట్టిన ఆర్య 27 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. దీంతో ఫస్ట్‌‌ టెన్‌‌లో స్కోరు 90/0కి పెరిగింది. 11వ ఓవర్‌‌లో ఆర్య ఓ సిక్స్‌‌, ప్రభు రెండు సిక్స్‌‌లు కొట్టడంతో 22 రన్స్‌‌ వచ్చాయి. కానీ 12వ ఓవర్‌‌లో బౌలింగ్‌‌కు దిగిన రసెల్‌‌ (1/27).. ఓ సిక్స్‌‌ ఇచ్చినా ఆర్యను ఔట్‌‌ చేసి తొలి వికెట్‌‌కు 120 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ చేశాడు.

38 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ చేసిన ప్రభు జోరు12వ ఓవర్‌‌ నుంచి రెట్టింపైంది. చేతన్‌‌ సకారియా, వరుణ్‌‌ (1/39) బౌలింగ్‌‌లో వరుసగా 4, 4, 6.. 4, 4, 6, 4తో 37 రన్స్‌‌ దంచాడు. కానీ 15వ ఓవర్‌‌లో వైభవ్‌‌ అరోరా (2/34)కు వికెట్‌‌ ఇవ్వడంతో రెండో వికెట్‌‌కు 40 రన్స్‌‌ జతయ్యాయి. 15 ఓవర్లలో స్కోరు 161/2గా మారింది. 

అప్పటి వరకు నెమ్మదిగా ఆడిన శ్రేయస్‌‌ (25 నాటౌట్‌‌) చివర్లో  వేగం పెంచాడు. 17వ ఓవర్‌‌లో వరుణ్‌‌ బాల్‌‌ను రివర్స్‌‌ స్వీప్‌‌తో ఫోర్‌‌ కొట్టిన మ్యాక్స్‌‌వెల్‌‌ (7)  తర్వాతి బంతికి వెనుదిరిగాడు. 172/3 వద్ద  వచ్చిన యాన్సెన్‌‌ (3) కూడా నిరాశపర్చాడు. ఆఖర్లో శ్రేయస్‌‌ 6, 4, జోస్‌‌ ఇంగ్లిస్‌‌ (11 నాటౌట్‌‌) 4, 4 కొట్టారు. చివరి ఐదు ఓవర్లలో 40 రన్స్‌‌ రావడంతో స్కోరు రెండొందలు దాటింది. 

సంక్షిప్త స్కోర్లు: పంజాబ్‌‌: 20 ఓవర్లలో 201/4 (ప్రభుసిమ్రన్‌‌ 83, ఆర్య 69, వైభవ్‌‌ 2/34). కోల్‌‌కతా: 1 ఓవర్‌‌లో 7/0 (గుర్బాజ్‌‌ 1*, నరైన్‌‌ 4*)