
- రష్యా- ఉక్రెయిన్ వార్పై డిస్కషన్స్.. వెల్లడించిన ట్రంప్
- యుద్ధానికి ముగింపు పలికేలా చూస్తమన్న అమెరికా ప్రెసిడెంట్
- ఆస్తులపై చర్చిస్తమని వెల్లడి
న్యూయార్క్: రష్యా– ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు అగ్రరాజ్యం అమెరికా చకచకా అడుగులు వేస్తున్నది. ఈ అంశంపై చర్చించేందుకు మంగళవారం రష్యా అధ్యక్షుడు పుతిన్తో యూఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చర్చలు జరపనున్నారు. ఫోన్లో తాను పుతిన్తో మాట్లాడనున్నట్టు ట్రంప్ వెల్లడించారు.
ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్కు తిరిగివస్తుండగా ఎయిర్ ఫోర్స్వన్లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘‘నేను మంగళవారం పుతిన్తో ఫోన్లో చర్చలు జరుపుతా. రష్యా– ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలనో లేదో చూడాలనుకుంటున్నా. భూమి, పవర్ప్లాంట్లపై చర్చిస్తా. రష్యా– ఉక్రెయిన్ మధ్య కొన్ని ఆస్తుల విభజనపై ఇప్పటికే మాట్లాడా” అని ట్రంప్ పేర్కొన్నట్టు మీడియాలో కథనం ప్రచురితమైంది.
ట్రంప్కు పుతిన్ సందేశం
రష్యా–ఉక్రెయిన్ మధ్య 30 రోజుల కాల్పుల విరమణను అమెరికా ప్రతిపాదించగా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దీనికి అంగీకరించారు. రష్యా కూడా సూత్రప్రాయంగా ఒప్పుకున్నప్పటికీ.. శాశ్వత పరిష్కారాలు ఉండాలంటూ మెలిక పెట్టింది. అప్పుడే మూడేండ్ల యుద్ధానికి ముగింపు పలుకుతామని సంకేతాలిచ్చింది.
అమెరికాతో చర్చలు జరిపేందుకు సిద్ధమేనని పేర్కొన్నది. వైట్హౌస్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ ద్వారా ట్రంప్కు పుతిన్ తన సందేశాన్ని పంపించారు. ఇందులో భాగంగానే ఈ వారంలోనే రష్యా– ఉక్రెయిన్ అంశంపై అమెరికా, రష్యా నేతలు చర్చలు జరుపుతారని విట్కాఫ్ ఇటీవల వెల్లడించారు. రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ కూడా దీనిని ధ్రువీకరించింది. ఇరుదేశాల అధ్యక్షులు మంగళవారం ఫోన్లో చర్చలు జరపనున్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు.
బైడెన్ఆటోపెన్తో చేసిన క్షమాభిక్షలు చెల్లవు
బైడెన్సర్కారు తన చివరి రోజుల్లో తీసుకున్న క్షమాభిక్షల నిర్ణయాలు చెల్లవని ట్రంప్ పేర్కొన్నారు. వాటిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘బైడెన్నిద్రమత్తులో చాలామందికి క్షమాభిక్షలు ప్రసాదించారు. ఆయన వాటిపై ఆటోపెన్తో సంతకం చేశారు. అసలు చెప్పాలంటే.. బైడెన్ వాటిపై సంతకం చేయలేదు.
ఆయనకు ఈ విషయమే తెలియదు. వాటికి అవసరమైన డాక్యుమెంట్ల గురించి కూడా బైడెన్కు వారు చెప్పనేలేదు. ఈ వ్యవహారం నడిపినవారు నేరం చేశారు. అలాగే, అన్సెలెక్ట్ కమిటీ.. ఆధారాలు మొత్తం నాశనం చేసింది” అని వార్నింగ్ ఇచ్చారు. కాగా, అమెరికన్ పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మన్తో ప్రధాని మోదీ మాట్లాడిన వీడియోను డొనాల్డ్ ట్రంప్ సోమవారం ట్రుత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.