
- మోసం చేసే వారిపై క్రిమినల్ కేసులు
- చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
కోల్బెల్ట్, వెలుగు : అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఓ వీడియో రిలీజ్చేశారు. ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామంటూ ఎవరైనా ప్రజలను మోసం చేస్తే ఊరుకునేది లేదన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు.
చెన్నూరు నియోజకవర్గానికి చెందిన పలువురు తమ పేర్లు ఇందిరమ్మ ఇండ్ల లిస్ట్లో లేవంటూ తనకు ఫోన్లు చేస్తున్నారని, ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లను స్క్రూట్నీ చేసి అర్హులైన వారికి మంజూరు చేస్తామన్నారు. కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకొని లిస్ట్లో పేర్లు వచ్చేలా చూస్తామని అమాయకులను నమ్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని, కాంగ్రెస్ హయాంలో అవకతవకలకు తావు లేదన్నారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. పేదలను మోసం చేసేందుకు ప్రయత్నించే వారిపై క్రిమినల్ కేసులు పెడుతామన్నారు. ప్రజాప్రభుత్వంలో ఎవరీకీ అన్యాయం జరగనివ్వబోమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.