హెచ్‌‌సీఏ నిధుల గోల్‌‌మాల్‌‌లో క్విడ్ ప్రో కో

హెచ్‌‌సీఏ నిధుల గోల్‌‌మాల్‌‌లో క్విడ్ ప్రో కో
  •     క్రికెట్‌‌ బాల్స్, బకెట్ కుర్చీలు, జిమ్‌‌ పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు
  •     కాంట్రాక్ట్ కంపెనీల నుంచి మాజీ వైస్ ప్రెసిడెంట్ సురేందర్ అగర్వాల్‌‌కు ఫండ్స్  
  •     ఆయన భార్య, కొడుకు, కోడలి అకౌంట్లలోకి రూ.90.86 లక్షలు
  •     మనీలాండరింగ్ జరిగినట్టు గుర్తించిన ఈడీ.. రూ.51.29 లక్షల విలువైన ఆస్తులు జప్తు  

హైదరాబాద్‌‌, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌‌సీఏ) నిధుల గోల్‌‌మాల్‌‌ కేసులో ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. క్రికెట్‌‌ బాల్స్‌‌, జిమ్ పరికరాలు, బకెట్ కుర్చీల కొనుగోళ్లలో క్విడ్ ప్రొకో జరిగినట్టు గుర్తించింది. కాంట్రాక్ట్‌‌ కంపెనీల నుంచి హెచ్‌‌సీఏ మాజీ వైస్ ప్రెసిడెంట్‌‌, ట్రెజరర్‌‌‌‌ సురేందర్ అగర్వాల్ కుటుంబ సభ్యుల అకౌంట్లకు మనీలాండరింగ్ జరిగినట్టు ఆధారాలు సేకరించింది. దీంతో సురేందర్‌‌‌‌ అగర్వాల్‌‌, ఆయన భార్య, కొడుకు, కోడలికి చెందిన రూ.51.29 లక్షల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఈ మేరకు ఈడీ హైదరాబాద్ జోనల్ ఆఫీస్‌‌ బుధవారం ప్రకటన విడుదల చేసింది. 

2023లో కేసు నమోదు.. 

మాజీ క్రికెటర్‌‌ అజహరుద్దీన్‌‌‌‌ హెచ్‌‌సీఏ ప్రెసిడెంట్‌‌గా ఉన్న సమయంలో వైస్‌‌ ప్రెసిండెంట్‌‌, ట్రెజరర్‌‌‌‌గా సురేందర్ అగర్వాల్‌‌ బాధ్యతలు నిర్వర్తించారు. వీరి హయాంలో 2019–2022 సంవత్సరాలకు గాను బీసీసీఐ నిధులు మంజూరు చేసింది. ఆ నిధులతో ఉప్పల్‌‌ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అవసరమైన క్రికెట్ బాల్స్‌‌, జిమ్ పరికరాలు, బకెట్ కుర్చీలు, అగ్నిమాపక పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే ఈ నిధుల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు అప్పటి ఫోరెన్సిక్‌‌ ఆడిట్‌‌ రిపోర్ట్‌‌లో వెల్లడైంది. దీంతో 2023 అక్టోబర్‌‌‌‌లో హెచ్‌‌సీఏ సీఈవో కాంటే సునీల్‌‌ ఉప్పల్‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సునీల్ ఫిర్యాదు మేరకు ఉప్పల్‌‌ పోలీసులు నాలుగు ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌లు నమోదు చేశారు. ఉప్పల్‌‌ పీఎస్‌‌లో రిజిస్టర్ అయిన ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌ల ఆధారంగా ఈడీ ఈసీఐఆర్‌‌‌‌ నమోదు చేసింది. మనీలాండరింగ్‌‌ కోణంలో నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు చేసింది.

 సారా స్పోర్ట్స్ నుంచి 17 లక్షలు.. 

ఉప్పల్‌‌ స్టేడియం నిర్వహణలో భాగంగా క్రికెట్ బాల్స్‌‌, బకెట్ కుర్చీలు, జిమ్ పరికరాల సప్లయ్‌‌ చేసేందుకు సారా స్పోర్ట్స్, ఎక్సలెంట్ ఎంటర్‌‌‌‌ప్రైజెస్, బాడీ డ్రెంచ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌‌ కంపెనీలకు కాంట్రాక్టులు అప్పగించారు. వీటికి సంబంధించి సాధారణ ధరలతో పోల్చితే అధిక ధరలతో లావాదేవీలు జరిగాయి. ఇలా అక్రమంగా వచ్చిన లాభాలు ఆయా కంపెనీల నుంచి హెచ్‌‌సీఏ మాజీ వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్ సురేందర్ అగర్వాల్ సహా ఆయన కుటుంబ సభ్యులకు బదిలీ అయ్యాయి. కాంట్రాక్టు కంపెనీల నుంచి సురేందర్ అగర్వాల్‌‌కు చెందిన కంపెనీలకే క్విడ్ ప్రోకో విధానంలో నిధుల మళ్లింపు జరిగింది. సురేందర్ అగర్వాల్‌‌ భార్య పేరుతో ఉన్న కేబీ జ్యువెలర్స్‌‌కు, ఆయన కొడుకు అక్షిత్ అగర్వాల్ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లకు సారా స్పోర్ట్స్‌‌ అకౌంట్‌‌ నుంచి రూ.17 లక్షలు బదిలీ అయ్యాయి. ఇలా క్విడ్‌‌ ప్రోకో విధానంలో డిపాజిట్‌‌ అయిన డబ్బును.. మ్యూజిక్ షో, ఈవెంట్ మేనేజ్‌‌మెంట్ స్పాన్సర్‌‌‌‌షిప్‌‌ పేరుతో అక్షిత్ మళ్లించేవాడు. 

బాడీ డ్రెంచ్ నుంచి 52 లక్షలు 

బకెట్ కుర్చీల కాంట్రాక్ట్ సంస్థ ఎక్సలెంట్ ఎంటర్‌‌ప్రైజెస్ ద్వారా అక్షిత్ అగర్వాల్ అకౌంట్‌‌కు రూ. 21.86 లక్షలు బదిలీ అయ్యాయి. దీన్ని కేబీ జ్యువెలర్స్‌‌లో వజ్రాల కొనుగోలు లోన్‌‌గా పేర్కొన్నారు. ఇలా ఎక్సలెంట్ ఎంటర్‌‌ప్రైజెస్ నుంచి ప్రొసీడ్స్‌‌ ఆఫ్ క్రైమ్(పీఓసీ) కింద క్విడ్‌‌ ప్రోకో విధానంలో మనీలాండరింగ్‌‌ జరిగింది. అలాగే బాడీ డ్రెంచ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వద్ద అధిక ధరలకు జిమ్ పరికరాలను కొనుగోలు చేసినట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. ఇందుకు గాను కేబీ జ్యువెలర్స్‌‌లో వజ్రాల కొనుగోలు పేరుతో సురేందర్ అగర్వాల్, ఆయన కోడలికి చెందిన బ్యాంకు అకౌంట్లకు.. బాడీ డ్రెంచ్ ఇండియా అకౌంట్‌‌ నుంచి రూ. 52 లక్షలు బదిలీ అయ్యాయని గుర్తించింది. ఇలా క్రికెట్ బాల్స్‌‌, బకెట్ కుర్చీలు, జిమ్ పరికరాలు సరఫరా చేసే కాంట్రాక్టర్ల ద్వారా సురేందర్ అగర్వాల్‌‌ కుటుంబ సభ్యులకు మొత్తం రూ. 90.86 లక్షలు చేరినట్టు ఆధారాలు సేకరించింది.