
దుబ్బాక, వెలుగు : భారతీయ సంస్కృతి, సంప్రదాయాయాలను బీజేపీ కాపాడుతుంటే ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పబ్బుల పేరుతో పాశ్చాత్య సంస్కృతికి ఆజ్యం పోస్తున్నాడని బీజేపీ దుబ్బాక అభ్యర్థి, ఎమ్మెల్యే రఘునందన్రావు విమర్శించారు. మంగళవారం ఆయన మండలంలోని హబ్షీపూర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బైక్ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జరిగిన కార్నర్ మీటింగ్లో మాట్లాడారు.
దుబ్బాక అభివృద్ధి కోసం నిధులు కావాలని, సమస్యలు తీర్చాలని అసెంబ్లీలో నిలదీస్తే ఇది భరించలేని పొలిటికల్టూరిస్టులు తనను టార్గెట్ చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. దళిత, బీసీ, మైనార్టీ బంధు, రేషన్ కార్డు, ఇంటికో కొలువు, డబుల్ బెడ్రూమ్, ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు ఎందుకివ్వడం లేదని అడిగితే మామ, అల్లుళ్లు తిట్టడం మొదలెట్టారని ఆరోపించారు. దుబ్బాకకు రింగ్ రోడ్డు కావాలని రెండేళ్ల కింద అప్లై చేస్తే ఇంతవరకు మంజూరు చేయలేదు కానీ కేపీఆర్ను గెలిపిస్తే రింగ్రోడ్డు ఇస్తానని ఆశీర్వాద సభలో సీఎం ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.
దుబ్బాక పట్టణంలో బీఆర్ఎస్ నాయకుల అరాచకాలు ఎక్కువయ్యాయని ఈ నెల 30న ప్రజలు కర్రు కాల్చి వాత పెట్డడడం ఖాయమన్నారు. గెలిచిన తర్వాత మంత్రి హరీశ్ మాదిరి తోటపల్లికి పోనని, కేపీఆర్లాగా తుజాల్పూర్కు వెళ్లనని, ఇక్కడే పుట్టానని, ఇక్కడే పెరిగానని, చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు ఇక్కడే ఉంటానని పేర్కొన్నారు. దుబ్బాక అభివృద్ధి కావాలంటే రెండు కళ్లున్న రఘునందన్ రావు కావాల్నా, దుబ్బాకపై సవతి తల్లి ప్రేమ చూపించే హరీశ్రావు కావాల్నో ప్రజలు తేల్చేకోవాలన్నారు. సకల జనుల సౌభాగ్యం కోసం మీ అమూల్యమైన ఓటును కమలం పువ్వు గుర్తుపై వేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపు నిచ్చారు.