
మెదక్ (చేగుంట), వెలుగు : నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించకున్నా తాను ఎవరికి తలవంచకుండా పనులు చేశానని దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. బుధవారం చేగుంట మండలం చందాయిపేట, కసాన్పల్లి, అనంతసాగర్, ఉల్లితిమ్మాయిపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో దుబ్బాకలో బీఆర్ఎస్అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొత్త ప్రభాకర్ రెడ్డి తొమ్మిదేళ్లు ఎంపీగా ఉన్నా నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమి లేదని విమర్శించారు.
చేగుంట మండలంలో ఎవరికి దళిత బంధు, బీసీలకు ఆర్థికసాయం మంజూరు కాలేదన్నారు. ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచిన తాను కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించాన్నారు. మరోమారు తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైస్ఎంపీపీ రాంచంద్రం, మండల పార్టీ అధ్యక్షుడు భూపాల్, నాయకులు వెంగళ్ రావు, రఘువీర్రావు, హరిశంకర్ పాల్గొన్నారు.