
- ఎమ్మెల్యే రఘునందన్రావు
దుబ్బాక, వెలుగు: గ్రామంలో తక్షణమే బీటీ రోడ్డును వేయకుంటే గ్రామస్తులతో కలిసి మీ ఆఫీసుకొచ్చి ధర్నా చేస్తానని పీఆర్ అధికారులను ఎమ్మెల్యే రఘునందన్రావు హెచ్చరించారు. గురువారం దుబ్బాక మండలం అప్పనపల్లి, హసన్మీరాపూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. తన సొంత డబ్బులతో నిర్మంచే అప్పనపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి హసన్మీరాపూర్ వరకు గల మూడు కిలో మీటర్ల రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం అప్పనపల్లిలో మాట్లాడుతూ గ్రామంలో ఆగిపోయిన బీటీ రోడ్డును సోమవారంలోగా పూర్తి చేయాలన్నారు.
లేదంటే ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని అధికారులను ఫోన్లో హెచ్చరించారు. వెంటనే రోడ్డు పనులను ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అనంతరం అక్భర్పేట–భూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామంలో మహాజన సంపర్క్ అభియాన్లో భాగంగా ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పగడాల నరేందర్, పర్శరామలు, అధికం వెంకటేశ్, లక్ష్మారెడ్డి, రాజిరెడ్డి, నర్సింలు పాల్గొన్నారు.
క్రీడల్లో యువత పాల్గొనాలి
సిద్దిపేట, వెలుగు: క్రీడల్లో యువత చురుకుగా పాల్గొనాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పిలుపునిచ్చారు. గురువారం సిద్దిపేటలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ రన్ లో పాల్గొని మాట్లాడారు. శారీరక కదలికల ద్వారానే మంచి ఆరోగ్యం సాధిస్తామన్నారు. డిగ్రీ కళాశాల నుంచి ముస్తాబాద్ చౌరస్తా వరకు నిర్వహించిన రన్ లో రెండు వందల మంది పాల్గొన్నారు. రన్ విజేతలకు ఆయన బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ గంగాడి మోహన్ రెడ్డి, జిల్లా యువజన క్రీడాధికారి నాగేందర్ గౌడ్ , నెహ్రూ యువజన కన్వీనర్ రంజిత్ , గన్నె రాజు రెడ్డి, విభీషణ్ రెడ్డి ,హరికిషన్ బండారుపల్లి శ్రీనివాస్, రామేశ్వర్ రెడ్డి, తోట సతీశ్, పాల్గొన్నారు.