
- పారా వాలీబాల్ వరల్డ్ సిరీస్ కు ఎంపికైన దివ్యాంగుడు నరేశ్
- చైనా వెళ్లడానికి డబ్బు లేక ఇక్కట్లు
- ఆర్థిక సాయం కోసం తెలంగాణ బిడ్డ వేడుకోలు
హైదరాబాద్, వెలుగు: ప్రతిభకు వైకల్యం అడ్డుకాదని అతను ఇప్పటికే చాలా సార్లు నిరూపించాడు. చదువుతో పాటు ఆటల్లోనూ రాణిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. పారా అథ్లెట్ గా ఒకటి కాదు అనేక క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించాడు. జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలిచి వైకల్యాన్నే అధిగమించాడు. కానీ, పేదరికాన్ని మాత్రం ఓడించలేకపోతున్నాడు . అంతర్జాతీయ పోటీలకు ఎంపికవుతున్నా.. విదేశాలకు వెళ్లి ఆడేందుకు ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్నాడు . ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేక.. ప్రతిసారి ఎవరో ఒకరి ఆపన్న హస్తంకోసం ఎదురుచూస్తున్న అతని పేరు రాగుల నరేశ్ యాదవ్ . నల్లగొండ జిల్లాకు చెందిన నరేశ్ పోలియో బాధితుడు. చిన్నప్పుడే అతని ఎడమ కాలుకు పోలియో సోకింది. కుంటివాడివంటూ వెక్కిరింపులు.. అతనిలో ఏదైనా సాధించాలన్న కసిని పెంచాయి. దాంతో,చదువుతో పాటు పారా గేమ్స్లో నూ సత్తా చాటాలని నిర్ణయించుకున్నాడు .
జేఎన్ టీయూలో ఎంటెక్ పూర్తిచేసిన నరేశ్ .. పారా వాలీబాల్ , బ్యాడ్మింటన్ , అథ్లెటిక్స్లో నేషనల్ , ఇంటర్ నేషనల్ లెవెల్ లో ఎన్నోపతకాలు సాధించాడు. ఇప్పుడు చైనాలో జరిగే పారావాలీబాల్ వరల్డ్ సిరీస్ లో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ఎప్పట్లాగే చైనా వెళ్లేందుకు దాతల సాయంకోసం ఎదురు చూస్తున్నాడు . ‘నేషనల్ గేమ్స్తో పాటు గతేడాది జరిగిన పారా నేషనల్ చాంపియన్ లో ప్రతిభ ఆధారంగా పారా వాలీబాల్ వరల్డ్ సిరీస్ లో పాల్గొనే ఇండియా టీమ్కు నేను సెలెక్ట్ అయ్యా . మే 6 నుంచి 13వ తేదీ వరకు చైనాలోని ఫుజౌ పింగ్టన్బీచ్ లో ఈ పోటీలు జరుగుతాయి. ప్రభుత్వం నుంచి గ్రాంట్ లు లేకపోవడంతో ప్లేయర్లు సొంత ఖర్చులతో టోర్నీకి వెళ్లాలని పారాలింపిక్ వాలీబాల్ ఫెడరేషన్ తెలిపింది. విమాన టిక్కెట్ లు, టోర్నీ ఎంట్రీ ఫీజు, భోజన, వసతికి గాను మొత్తం లక్షా ముప్పై తొమ్మి దివేల రూపాయాలు మే 4వ తేదీలోపు చెల్లించాలని చెప్పింది.
మాది నిరుపేద కుటుంబం. ఇంత మొత్తం ఖర్చు చేసే పరిస్థితి లేదు. గతేడాది బ్యాంకాక్ లోజరిగిన టోర్నమెంట్ లో పాల్గొనడానికి హీరో సాయిధరమ్ తేజ్ లక్ష రూపాయలు ఇచ్చారు. నేపాల్ టోర్నీకి వెళ్లినప్పుడు జీహెచ్ ఎంసీ మేయర్ బొంతు రామ్మె హన్ భార్య శ్రీదేవి కూడా సాయం చేశారు. వారిద్దరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటా. ఇప్పుడు కూడాఎవరైనా ముందుకొచ్చి ఆర్థిక సాయం చేస్తే టోర్నీలో సత్తా చాటి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకొస్తా’ అని నరేశ్ విజ్ఞప్తి చేస్తున్నాడు .