త్వరలో భారత్ డోజో యాత్ర.. రాహుల్ గాంధీ ప్రకటన

త్వరలో భారత్ డోజో యాత్ర.. రాహుల్ గాంధీ ప్రకటన
  • మార్షల్ ఆర్ట్స్​ను యూత్​కు పరిచయం చేయటమే లక్ష్యమని వెల్లడి
  • వీడియో షేర్ చేసిన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: త్వరలో తాను 'భారత్ డోజో యాత్ర' చేపడతానని లోక్ సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వెల్లడించారు. మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్లను డోజోగా పిలుస్తారని తెలిపారు. మెడిటేషన్, జివూ- జిట్సూ(బ్రెజిల్ మార్షల్ ఆర్ట్స్), ఐకిడో (జపాన్ మార్షల్ ఆర్ట్స్) వంటి ఆర్ట్స్ లను ఉపయోగించి అహింసతో  ఘర్షణలను పరిష్కరించే పద్ధతులు యువతకు పరిచయం చేయడమే తమ లక్ష్యమని వెల్లడించారు. గురువారం నేషనల్ స్పోర్ట్స్​ డే సందర్భంగా రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ్ యాత్ర చేసే టైంలో తమ శిబిరాల వద్ద జరిగిన మార్షల్ ఆర్ట్స్ సెషన్ వీడియోను ఎక్స్ లో షేర్ చేశారు.

ఆ వీడియోలో స్టూడెంట్లకు రాహుల్ మార్షల్ ఆర్ట్స్ సెషన్స్ నిర్వహించారు. తనకు ఐకిడోలో బ్లాక్ బెల్ట్, జివూ -జిట్సూలో బ్లూ బెల్ట్ ఉందని తెలిపారు. తన వీడియో ద్వారా కొందరిలోనైనా ఈ ఆర్ట్స్ నేర్చుకోవాలనే ఇంట్రస్ట్ రావాలని ఆశించారు. "మేం వేల కిలోమీటర్లు జోడో యాత్ర చేశాం. ఆ టైంలో మా శిబిరాల వద్ద ప్రతిరోజు జివు-జిట్సూ ప్రాక్టీస్ చేసేవాళ్లం. ఫిట్ గా ఉండేందుకు మేం ప్రారంభించిన యాక్టివిటీ అందరికీ చేరువైంది. మేం బస చేసిన ప్రాంతాల్లోని తోటి యాత్రికులు, యువ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులను ఒకచోటకు చేర్చింది. మెడిటేషన్, జివూ-జిట్సూ, ఐకిడోల వంటి జెంటిల్ ఆర్ట్స్ ను యువతకు పరిచయం చేయడమే మా లక్ష్యం.

దీనిద్వారా ఘర్షణ వాతావరణాన్ని సౌమ్యంగా మార్చే విలువల్ని వారిలో పెంపొందించాలని, దయ, సురక్షితమైన సమాజం కోసం కావాల్సిన సాధనాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకే త్వరలో భారత్ డోజో యాత్ర చేపట్టాలని నిర్ణయించాం" అని రాహుల్ ట్వీట్ చేశారు. రాహుల్ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' మొత్తం 110 జిల్లాలు, 100 లోక్ సభ స్థానాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 60 రోజులకుపైగా 6,713 కిలోమీటర్ల మేర కొనసాగింది. అంతకుముందు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడోయాత్ర' ను నిర్వహించారు.