
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పోటీచేసిన రెండు చోట్లా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. యూపీలోని రాయ్బరేలీ, కేరళలోని వయనాడ్లో 6లక్షల పైచిలుకు ఓట్లతో జయకేతనం ఎగురవేశారు. తొలిసారి బరిలో నిలిచిన రాయ్బరేలీలో రోరింగ్ విక్టరీ నమోదు చేశారు. దాదాపు 4 లక్షల ఓట్ల మెజార్టీ (3,90,030)తో విన్ అయ్యారు. 2019లో తల్లి సోనియాగాంధీ కంటే డబుల్ మెజార్టీ సాధించారు. ఇక్కడ మొత్తం 6,87,649 ఓట్లతో రాహుల్ గెలుపొందగా, బీజేపీకి చెందిన దినేశ్ప్రతాప్సింగ్ 2,97,619 ఓట్లతో రెండోస్థానంలో, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి చెందిన ఠాకూర్ ప్రసాద్ యాదవ్ 21,624 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు.
తల్లిని మించిన తనయుడు
సోనియాగాంధీ 2004 నుంచి వరుసగా 4 సార్లు రాయ్బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎన్నికల్లో దినేశ్ ప్రతాప్సింగ్పై 1.67లక్షల ఓట్ల మెజార్టీతో ఆమె గెలుపొందారు. అయితే, రాజస్థాన్నుంచి రాజ్యసభకు ఎన్నికైన సోనియాగాంధీ.. రాయ్బరేలీలో ఈ సారి తన స్థానంలో కొడుకు రాహుల్గాంధీని బరిలో నిలిపారు. తల్లి సోనియా పెట్టుకున్న ఆశను వమ్ము చేయకుండా రాహుల్ ఈ స్థానంలో ఆమెకంటే డబుల్ మెజార్టీతో ఘన విజయం సాధించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ అమేథీ నుంచి పోటీ చేసినా ఓటమి పాలుకాగా, వయనాడ్ నుంచి ఎంపీగా గెలుపొందారు.
వయనాడ్లోనూ గెలుపు
వయనాడ్లోనూ రాహుల్గాంధీ గ్రాండ్ విక్టరీ సాధించారు. సీపీఎంకు చెందిన అన్నే రాజాపై 3,64,422 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాహుల్కు మొత్తం 6,47,445 ఓట్లు రాగా, అన్నే రాజా 2,83,023 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. బీజేపీకి చెందిన కే సురేంద్రన్ 1,41,045 ఓట్లతో మూడోస్థానానికి పరిమితమయ్యారు. 2019 లోక్సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి బరిలోకి దిగిన రాహుల్, సమీప అభ్యర్థి పీపీ సునీర్ (సీపీఐ)పై 4.31 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.