నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​ : ఇంటర్, డిగ్రీ అర్హతతో రైల్వేలో 11,558 ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​ : ఇంటర్, డిగ్రీ అర్హతతో రైల్వేలో 11,558 ఉద్యోగాలు

నిరుద్యోగులకు రైల్వే శాఖ భారీ శుభవార్త అందించింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో 11 వేల 558 ఖాళీల భర్తీ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలో గ్రాడ్యుయేట్‌, అండర్‌ గ్రాడ్యుయేట్‌లకు సంబంధించి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో 8వేల 113 గ్రాడ్యుయేట్‌ స్థాయి పోస్టులు, 3వేల445 అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోస్టులు ఉన్నాయి. 

అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్‌పుర్, జమ్ము & శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం రీజియన్లలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు.గ్రాడ్యుయేట్ కేటగిరీలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులను, అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్ క్లర్క్, ట్రైన్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. 

గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. 2025 జనవరి 1 వ తేదీ  నాటికి 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల  సడ లింపు ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.29,200 నుంచి రూ.35,400 వరకు జీతంగా చెల్లిస్తారు. 

అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయోపరిమితి 2025 జనవరి 1 వ తేదీ  నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల  సడలింపు ఉంటుంది.

ఎంపికైన వారికి నెలకు రూ.19,900 నుంచి రూ.21,700 వరకు జీతంగా చెల్లిస్తారు. ఈ మేరకు ఆర్‌ ఆర్‌బీ షార్ట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్‌ 14వ తేదీన పూర్తి వివరాల తో వివరణాత్మక నోటిఫి కేషన్‌ విడుదలకానుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ గ్రాడ్యు యేట్‌ స్థాయి పోస్టులకు సెప్టెంబర్‌ 14న ప్రారంభమై.. అక్టోబర్ 13వ తేదీతో ముగుస్తుంది. 

ఇక అండర్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయి పోస్టులకి సెప్టెంబర్‌ 21 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అక్టోబర్‌ 20వ తేదీతో ముగుస్తుంది. దరఖాస్తు రుసుము కింద జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికుల కుటుంబాలకు చెందిన వారు, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250 చెల్లించాలి. 

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (టైర్-1, టైర్-2), స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.