
- రెండో ప్లాట్ ఫామ్కొంత కూల్చివేత
- 30 రైళ్ల రాకపోకలు రద్దు, పలు రైళ్లు ఆలస్యం
ఖమ్మం, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కాజీపేట –విజయవాడ మధ్య మూడో రైల్వే లైన్ పనులు చకచక కొనసాగుతున్నాయి. రైల్వే అమృత్ పథకం కింద ఈ పనులు చేపట్టారు. ఖమ్మం మీదుగా హైదరాబాద్, వరంగల్, విజయవాడ పరిధిలో పలు రైళ్లను రద్దు చేసి మరీ వేగంగా పనులు చేస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో ఇంటర్లాకింగ్ పనులు జరుగుతున్నాయి. దీని కోసం ఖమ్మం రైల్వే స్టేషన్ లో రెండో ప్లాట్ ఫామ్ ను కొంత మేర కూల్చివేశారు.
కొండపల్లి నుంచి కాజీపేట వరకు పలు స్టేషన్లలో ఇప్పటికే లైన్ నిర్మాణం పూర్తయింది. మిగిలిన చోట్ల పనులు స్పీడప్ చేసి జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొండపల్లి - మధిర మధ్య మూడో లైన్ నిర్మాణం పనులు పూర్తికాగా ఇటీవల ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. మధిర నుంచి మోటమర్రి వరకు మూడో లైన్ ను మార్చి వరకు, మోటమర్రి నుంచి పందిళ్లపల్లి స్టేషన్ వరకు ఏప్రిల్ లోపు పనులు పూర్తి చేయాలని ప్లాన్చేస్తున్నారు. ఈ పనుల కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇదంతా పూర్తయ్యాక ఖమ్మం నుంచి డోర్నకల్ వరకు, ఆ తర్వాత మహబూబాబాద్ వరకు పనులు చేయనున్నారు.
చిన్నచిన్న పనులు పెండింగ్..
మహబూబాబాద్నుంచి నెక్కొండ వరకు జరిగే పనులు ఓ కొలిక్కి వచ్చినా ఇంకా కొన్ని చిన్న పనులు మిగిలిపోయాయి. ప్రతి రెండు స్టేషన్ల మధ్య ప్రస్తుతం ఉన్న రెండు లైన్లకు తోడు మూడో లైన్ ఏర్పాటు చేస్తుండగా స్టేషన్ లోకి వచ్చే వరకు నాలుగు లైన్లుంటాయి. దీంతో కొత్త లైన్ నుంచి స్టేషన్ లోని లైన్లకు అనుసంధానించే ఇంటర్లాకింగ్ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. భారీ క్రేన్లతో పట్టాలను బిగిస్తున్నారు.
10 రోజులపాటు పలు రైళ్లు దారి మళ్లింపు..
ఈ పనుల కారణంగా ఖమ్మం మీదుగా విజయవాడ, వరంగల్ వైపు వెళ్లే పలు రైళ్లను ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారిమళ్లించారు. అయితే రద్దయిన రైళ్లలో కొన్నింటిని నిర్ణీత తేదీల్లో నడిపించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. భద్రాచలం -విజయవాడ, డోర్నకల్ విజయవాడ ప్యాసింజర్లు, గోల్కొండ, శాతవాహన, ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైళ్లను ఈనెల 10 నుంచి పది రోజుల వరకు రద్దు చేశారు. ఖమ్మం మీదుగా నడిచే 107 రైళ్లలో 30 రైళ్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని అధికారులు సూచించారు.
టౌన్లో కొంత ఇబ్బంది..
ఈ నిర్మాణ పనులతో గాంధీ చౌక్దగ్గర ఉన్న రైల్వే గేటును అధికారులు ఈనెల 15 నుంచి 22 వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. దీని కారణంగా త్రీటౌన్ లోని గాంధీ చౌక్ నుంచి కమాన్ బజార్, కస్బాబజార్ మధ్య రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది. ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు మయూరి సెంటర్, వెంకటగిరి మీదుగా తిరిగి వెళ్లాల్సి వస్తోంది.