
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఈరోజు(మార్చి 22) ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి బలహీనపడింది. ద్రోణి బలహీనపడడంతో ఈరోజుతో(మార్చి 22) పాటు రేపు (మార్చి 23) కూడా వాతావరణ శాఖ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది. ఈ రోజు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఈరోజు ఉత్తర, దక్షిణ, ఈశాన్య జిల్లాలో వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో 9 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. కొమరం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్ జిల్లాల్లో ఈరోజు వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబాబాద్ నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఈరోజు(మార్చి 22) ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.