వానాకాలం పంటలు.. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

వానాకాలం పంటలు.. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

వాకాలం వచ్చింది.. వర్షాలు పడుతున్నాయి.  పచ్చగా ఉన్న నారుమళ్లు వరద నీటిలో మునుగుతున్నాయి.  విత్తన సాగు చేసేందుకు రైతన్నలు సిద్ధమవుతున్నారు.  అయితే రైతులు కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయశాఖాధికారులు సూచిస్తున్నారు.

 తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.  ఇంకా ఐదు రోజుల పాటు  ఉరుములు మెరుపులు, ఈదురు గాలుల (గాలి వేగం గంటకు 30-నుంచి 40 కి. మీ) తో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 26 నుండి 36 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుండి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. 

వరి: వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ మండలాలోని జిల్లాలలో పొడిగా విత్తి తడి పద్దతిలో సాగు చేసే వరి పంటను విత్తుకొనుటకు అనుకూల సమయం. నీరు సంవృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు స్వల్పకాలిక (120-నుంచి125 రోజుల) వరి రకాల నారుమళ్ళు పోసుకోవడానికి ఇది అనువైన సమయం.


వరి నాట్లు వేసుకునే వారం రోజుల ముందు ఎకరాకు సరిపోయే నారుమడికి 800 గ్రా. కార్బోప్యూరాన్ 3.జి గుళికలను ఇసుకలో కలిపి చల్లితే ప్రధాన పొలంలో పంటను 15నుంచి -20 రోజుల వరకు కొన్ని రకాల పురుగుల నుండి కాపాడుకోవచ్చు. 25రోజుల వయస్సున్న దీర్ఘకాలిక వరి రకాల నారును నాటు పెట్టుకోవాలి. నాటిన తర్వాత ప్రతి 2మీటర్లకు కాలిబాటను తీయటం వలన గాలి వెలుతురు బాగా ప్రసరించడంతో బాటు సుడిదోమ ఉదృతిని నివారించవచ్చు. అదేవిధంగా రైతులు ఎరువులు, పురుగు మందులు పంటకు అందించడానికి సులువుగా ఉంటుంది.ముందస్తు నివారణ చర్యలో భాగంగా ఎకరానికి 10 కిలోల కార్బోప్యూరాన్ 3 జి గుళికలను నాటిన 10 నుండి 15 రోజుల మధ్య వేసుకోవడం ద్వారా కాండం తొలుచు పురుగు, ఉల్లి కోడును నివారించుకోవచ్చు.

వరి సాగు చేసే రైతులు వరిగట్లను శుభ్రంగా ఉంచుకోవాలి లేనట్లయితే గట్లమీద ఉండే కలుపు మొక్కలపైన కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులు నివసించి వరి పంటను ఆశిస్తుంది. వరి మొక్కలను పోలిన ఊద, ఓడిపిలి గడ్డిజాతి కలుపు మొక్కల నివారణకు 7.5మి.లీ. సైహలోఫాప్ పి-బ్యుటైల్ మందును 5లీటర్ల నీటిలో కలిపి 15రోజుల వయస్సు గల వరి నారుమడిలో పిచికారి చేయాలి.

పత్తి: పత్తి పంట దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా సాగు చేసుకోవచ్చు. వర్షాదార పత్తి పంట బోదెలు, కాలువల పద్ధతిలో విత్తుకున్నట్లయితే తేమ సంరక్షించుకోవటంతో పాటు ఎక్కువ వర్షాలు పడినప్పుడు కాలువల ద్వారా నీటిని తీసివేయుటకు అనుకూలంగా ఉంటుంది. పత్తిలో అక్కడక్కడ రసం పీల్చే పురుగులు వస్తుంటాయి. ముందు జాగ్రత్తగా కాండానికి మందు పూసే పద్ధతిలో మొనోక్రోటోఫాస్ + నీరు (1:4 నిష్పత్తి) మిశ్రమ ద్రావణాన్ని 30 మరియు 45 రోజుల పంట దశలో కాండం మీద పూయాలి. పత్తి పంట విత్తిన 2 వారాల తర్వాత ముందు జాగ్రత్తగా రసం పీల్చే పురుగుల నియంత్రించడానికి ఎకరానికి 5 పసుపు, 5 నీలం రంగు జిగురు అట్టలను అమర్చాలి. మొదటి దఫా పైపాటు నత్రజని, పొటాషియం ఇచ్చే ఎరువులను 20 రోజుల తరువాత భూమిలో తేమ ఉన్నప్పుడు అందించాలి..

మొక్కజొన్న: మొక్కజొన్న పంటను  స్వల్పకాలిక రకాలను దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా విత్తుకోవచ్చు. మొక్కజొన్న శాకీయ దశలో ఎక్కువ నీటిని, ప్రత్యుత్పత్తి దశలో నీటి ఎద్దడిని తట్టుకోలేదు కాబట్టి పంటను బోదెలు, కాలువల పద్ధతిలో సాగు చేసుకోవాలి. ముందు జాగ్రత్తగా పంటను విత్తిన 15 రోజుల వ్యవధిలో కత్తెర పురుగు నివారణకు 1500 పి. పి. ఎం. వేపనూనె మందును 5 మీ.లీ. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. లింగాకర్షక బుట్టలను అమర్చడం ద్వారా కత్తెర పురుగు ఉదృతిని గమనించవచ్చు. ఆఖరి దుక్కిలో మొత్తం భాస్వారం, 1/3వ వంతు నత్రజని, సగం పొటాష్ ఇచ్చే ఎరువులను చివరి దుక్కిలో వేసుకోవాలి.

జొన్న: జొన్నలో మొవ్వ తొలచు ఈగ గమనించడమైనది. నివారణకు 2మి.లీ. కార్బోసల్ఫాన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
జొన్నలో కాండం తొలుచు పురుగు నివారణకు పంట విత్తిన 30నుంచి -35 రోజుల దశలో ఎకరాకు 4 కిలోల కార్బోప్యూరాన్ 3జి గుళికలను కాండము సుడులలో వేయాలి.

పెసర, మినుము: పెసర, మినుము పంట విత్తిన 2 వారాల తర్వాత ముందు జాగ్రత్తగా రసం పీల్చే పురుగులను నియంత్రించడానికి ఎకరానికి 5 పసుపు, 5 నీలం రంగు జిగురు అట్టలను అమర్చాలి.

సోయాచిక్కుడు: సోయాచిక్కుడు పంట విత్తిన 2 వారాల తర్వాత కాండం తొలిచే ఈగ,  తెల్లదోమను నియంత్రించడానికి ఎకరానికి 5 పసుపు, 5 తెలుపు జిగురు అట్టలను అమర్చాలి. ముందు జాగ్రత్తగా సోయాచిక్కుడులో స్టెమ్ గర్డిల్ ను నివారించడానికి 1500 పి. పి. ఎం.వేపనూనే మందును 5 మీ.లీ. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి

వేరుశనగ : ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వేరుశనగలో మొదలుకుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు మొక్కల మొదళ్ళ దగ్గర 2గ్రా. కార్బండజిమ్ + మ్యాంకోజేట్ మందును లీటరు నీటికి కలిపి నేలను తడపాలి.

చెరకు:తోట వయస్సు నాలుగు నెలలప్పుడు  మొక్కల వరుసల మొదళ్ళకు ఎత్తుగా మట్టిని ఎగదోయాలి. దీని వలన అధిక వర్షాలు, తుఫాను గాలులకు పంట పడిపోకుండా కాపాడుకోవచ్చు.

కూరగాయలు: కూరగాయ పంటలలో రసం పీల్చే పురుగులు గమనిస్తే 1500 పి. పి. ఎం. వేపనూనె మందును 5 మీ.లీ./ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఆకుమచ్చ తెగులు సోకె వీలుంటుంది. దీని నివారణకు 1 గ్రా. కార్బెండజిమ్ లేదా 1 మి.లీ. ప్రోపికోనజోల్ మందును లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. తీగ జాతి కూరగాయ పంటలు విత్తుటకు అనుకూలం. మిరప, టమాట, వంగ, బంతి పంటలను ఎత్తు మడుల మీద నారు పోయడం ద్వారా నారుకుళ్ళు తెగులు నివారించవచ్చు.

బత్తాయి, నిమ్మ: కొత్తగా తోటలు వేసే రైతులు 60 సెం.మీ. పొడవు, వెడల్పు. లోతు గల గుంతలు తీసి, దానిలో 5కిలోల పశువుల ఎరువు, 1కిలో సింగిల్ సూపర్ ఫాస్పేట్, 100గ్రా. క్లోరిపైరిఫాస్ పొడి మందులను పై మట్టికి కలిపి గుంతలను నింపుకోవాలి. నాణ్యమైన మొక్కలు నాటుకోవాలి.బత్తాయి, నిమ్మ తోటల్లో సిట్రస్ క్యాంకర్ ను నియంత్రించడానికి 1 గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ మరియు 30 గ్రాములు కాపర్ ఆక్సీ క్లోరైడ్ మందుని 10 లీటర్ల నీటికి కలిపి 20 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి.

మామిడి:రైతులు కోత అనంతరం 2-4 వారాల తరువాత ఎండు కొమ్మలను, తెగులు సోకిన కొమ్మలను, అడ్డంగా పెరిగిన కొమ్మలను కత్తిరించినట్లయితే గాలి, వెలుతురు మొక్కకు బాగా లభిస్తుంది. పోయిన సంవత్సరం వచ్చిన పూత కాడలను వెనుకకు కత్తిరించుకొని 3గ్రా. కాపర్ ఆక్సి క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. తోటలో రాలిపోయిన, కుళ్ళిపోయిన, తెగుళ్ళు ఆశించిన కాయలతో పాటు ఎండుఆకులను, కొమ్మలను సేకరించి తోటలకు దూరంగా కాల్చివేయాలి.

పశుపోషణ: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్ళలో కొక్కెర తెగులు, గొర్రెలలో చిటుకు, పి.పి.ఆర్, ఆవులు, గేదేలలో గొంతువాపు వ్యాధులు రావటానికి  అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. గొర్రెలలో నట్టల నివారణకు డీవార్మింగ్ చేయాలి.

వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు

రైతులు విద్యుత్ స్థంబాలు, విద్యుత్ తీగలు, చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండాలి. రైతులు చెట్ల కింద నిలబడరాదు.పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచరాదు. తేలిక పాటి నేలల్లో 50 నుంచి 60 మి.మీ., బరువు నేలలో 60 నుంచి 75 మి.మీ వర్షపాతం నమోదైన తరువాత లేదా నేల 15-20 సెం.మీ. లోతు తడిసిన తరువాతనే రైతులు వర్షాధార పంటలైన పత్తి, మొక్కజొన్న, కంది, పెసర మొదలగు పంటలను విత్తుకోవాలి.వేరుశనగ, పెసర, కంది, మినుము పంటలను విత్తుకునే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి.