మార్చి 31లోపు రైతులందరి ఖాతాల్లో ‘రైతు భరోసా’ డబ్బులు: సీఎం రేవంత్

మార్చి 31లోపు రైతులందరి ఖాతాల్లో ‘రైతు భరోసా’ డబ్బులు: సీఎం రేవంత్

మంచిర్యాల: మార్చి 31 లోపు రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మంచిర్యాలలో జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన సభ వేదికగా సీఎం రేవంత్ ఈ ప్రకటన చేశారు. రాష్ట్రంలో మూడెకరాల భూమి ఉన్న రైతులకు ప్రభుత్వం రైతు భరోసా నిధులు ఇప్పటికే జమ చేసిన సంగతి తెలిసిందే. రూ.1,230.98 కోట్లను ప్రభుత్వం రైతుల అకౌంట్లలో వేసింది.

దీంతో ఇప్పటి వరకు మొత్తం 44.82 లక్షల మంది రైతులకు రూ.3,487.82 కోట్ల రైతు భరోసా నిధులు అందాయి. జనవరి 26న పైలెట్‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టు కింద ప్రతి మండలంలో ఒక గ్రామానికి రూ.568.99 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఫిబ్రవరి 5న రాష్ట్రవ్యాప్తంగా ఒక ఎకరం వరకు ఉన్న 17 లక్షల మంది రైతులకు చెందిన 9.29 లక్షల ఎకరాల భూమికి గాను రూ.557.54 కోట్లు జమ చేశారు.

రెండెకరాల వరకు ఉన్న రైతులకు ఫిబ్రవరి 10న 13.23 లక్షల మందికి, ఫిబ్రవరి 12న రికార్డులు అప్‌‌‌‌డేట్ చేసిన 56 వేల మంది రైతులకు రూ.38.34 కోట్లతో కలిపి మొత్తం రూ.1,130.29 కోట్లు నిధులు జమ చేశారు. అదే రోజు మూడెకరాల వరకు ఉన్న 9.56 లక్షల మంది రైతులకు చెందిన 20.51 లక్షల ఎకరాలకు రూ.1,230.98 కోట్లు నిధులను డైరెక్ట్​ బెనిఫీషియరీ ట్రాన్స్‌‌‌‌ఫర్ ద్వారా రైతు ఖాతాల్లో వేశారు. దీంతో ఇప్పటి వరకు 44.82 లక్షల మంది రైతులకు చెందిన 58.13 లక్షల ఎకరాలకు రైతు భరోసా కింద రూ.3,487.82 కోట్ల నిధులను ప్రభుత్వం జమ చేసింది. మార్చి 31 లోపు మిగతా వారికి నిధులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ప్రకటించారు.