
రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఏప్రిల్ 17లోగా గ్రామాలు, వార్డుల వారీగా ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపునకు కార్యాచరణ సిద్ధం చేయాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్కుమార్ఝా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుపై ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో సొంత స్థలం ఉన్న నిరుపేదలకే మొదటి విడతలో ప్రాధాన్యమివ్వాలన్నారు.
జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో మొదటి విడతలో మొత్తం 7000 ఇండ్లకు శాంక్షన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. జనాభా ప్రాతిపదికన గ్రామాలు, వార్డులకు ఇండ్ల కేటాయింపు అనంతరం, ఏప్రిల్ 21లోగా ఇందిరమ్మ కమిటీలతో సమావేశం నిర్వహించి, అర్హుల జాబితాను రూపొందించాలన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో 1,023 ఇండ్లు మంజూరు చేయగా.. 282 మాత్రమే ఇప్పటివరకు మార్క్ చేయడం జరిగిందని, లబ్ధిదారులతో చర్చించి నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించేలా చూడాలన్నారు.
అంతకుముందు రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధికారులతో రివ్యూ చేశారు. జిల్లాలో ప్రమాదాల నివారణకు పటిష్ట కార్యాచరణ అమలుచేయాలని ఆదేశించారు. ప్రధాన కూడళ్లలో, అప్రోచ్ రోడ్ల వద్ద రబ్బర్ స్ట్రిప్స్, స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్డీవోలు రాధాభాయి, లక్ష్మణ్, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, హౌసింగ్ పీడీ శంకర్, డీఆర్డీవో శేషాద్రి, ఈఈ వెంకట రమణయ్య, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.