
- నేడు రాజరాజేశ్వరస్వామి దివ్య కల్యాణం
వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో ఆదివారం శివ కల్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలోని కల్యాణ మండపంలో ఆలయ స్థానాచార్యులు, అర్చకులు స్వస్తి పుణ్యహవాచనంతో ఉత్సవాలు ప్రారంభించారు. పంచగవ్య మిశ్రణం, దీక్షాధారణం, రుత్విక్ వరణం, మంటప ప్రతిష్ఠ, గౌరి ప్రతిష్ఠ, నవగ్రహ ప్రతిష్ఠ, అంకురార్పణ, వాస్తు హోమం, అగ్ని ప్రతిష్ఠతో పాటు వేదపారాయణం, పరివార దేవతార్చనలు, ధర్మగుండం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సోమవారం స్వామివారి కల్యాణ మండపంలో పార్వతి, రాజరాజేశ్వరస్వామి దివ్య కల్యాణం నిర్వహించేందుకు ప్రత్యేకంగా మండపాన్ని ఏర్పాటు చేశారు. ఆలయాన్ని రంగురంగుల పూలతో, గోపురాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఏర్పాట్లను ఆలయ ఈవో వినోద్రెడ్డి, ఎస్పీ మహేశ్ బి. గీతే పరిశీలించారు.