ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన.. డిప్యూటీ సీఎం కొడుక్కి భారీ జరిమానా

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన.. డిప్యూటీ సీఎం కొడుక్కి భారీ జరిమానా

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన రాజస్థాన్ డిప్యూటీ సీఎం ప్రేమ్‌చంద్ బైర్వా కుమారుడికి రాష్ట్ర రవాణా శాఖ షాకిచ్చింది. రూ.7,000 భారీ జరిమానా విధించింది. ఇతరులకు హాని కలిగించేలా డ్రైవింగ్ చేయడం, సీటు బెల్ట్‌ ధరించకపోవడం, డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్‌ ఉపయోగించడం వంటివి వెలుగులోకి రావడంతో రవాణా శాఖ ఈ చర్యలు తీసుకుంది.  

వైరల్ అవ్వడంతో చర్యలు

ఇటీవల డిప్యూటీ సీఎం ప్రేమ్‌చంద్ బైర్వా కుమారుడు, కాంగ్రెస్ నాయకుడు పుష్పందర్ భరద్వాజ్ కుమారుడు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఓపెన్ టాప్ జీపులో ఊరేగారు. ఆ సమయంలో వారి వాహనం వెనుక రాజస్థాన్ ప్రభుత్వ ఎస్కార్ట్ వాహనం పోలీసు లైట్లతో ఉంది. జైపూర్‌లోని అంబర్ రోడ్‌లో జరిగిన ఈ ఘటన నెట్టింట క్షణాల్లో వైరల్ అయ్యింది. తండ్రి అండ చూసుకొని కొడుకు ప్రభుత్వ సిబ్బందిని తన సోషల్ మీడియా రీల్స్ కొరకు వాడుకుంటున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.

కాగా, తన కొడుకు చేసిన తప్పుకు ప్రేమ్‌చంద్ బైర్వా పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. అలాంటి చర్యలను పునరావృతం చేయవద్దని తన కొడుకుకు సలహా ఇచ్చాడు.

ALSO READ | ఈ నీళ్లు ఎవరైతే తాగుతారో వాళ్లకే మా ఓటు: నేతలకు గ్రామస్థుల సవాల్