
- పెద్ద యూనిట్లకు డిమాండ్ ఎక్కువ
- రూ. లక్ష లోపు యూనిట్లకు అప్లికేషన్లు రెండు వేలు దాటలే
- రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల యూనిట్లకే ప్రియారిటీ ఇస్తున్న పబ్లిక్
యాదాద్రి, వెలుగు: రాజీవ్ యువ వికాసం (ఆర్వైవీ) స్కీమ్లో పెద్ద యూనిట్లకు అప్లై చేయడానికే ఎక్కువ మంది ఇంట్రస్ట్ చూపుతున్నారు. వంద శాతం సబ్సిడీ ఉన్న రూ. 50 వేలు, 90 శాతం సబ్సిడీ కలిగిన రూ. లక్ష లోన్ల కోసం పదుల సంఖ్యలోనే అప్లయ్ చేసుకుంటున్నారు. రూ. 2 లక్షలు అంతకు మించిన లోన్లకు మాత్రం వేల సంఖ్యలో అప్లయ్ చేసుకుంటున్నారు. యువతకు స్వయం ఉపాధి కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం (ఆర్వైవీ) స్కీమ్ అమలుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
రేషన్ కార్డులు కలిగిన బడుగు, బలహీన వర్గాల యువతతో పాటీ ఈబీసీ, మైనార్టీలకు ఆర్వైవీ స్కీమ్ కింద రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షల వరకు బ్యాంక్ లింకేజీతో లోన్ తీసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇందులో రూ. 50 వేల యూనిట్తో పాటు చిన్ననీటి పారుదల యూనిట్లకు అంటే వ్యవసాయ బోర్లు, బావుల తవ్వకం వంటి వాటికి రూ. లక్ష వరకు వంద శాతం సబ్సిడీతో ఎకనామిక్ సపోర్ట్ కల్పించనుంది. అదే విధంగా రూ. లక్ష లోపు 90 శాతం సబ్సిడీ, రూ. 2 లక్షల లోపు 80 శాతం సబ్సిడీ, రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల లోపు 70 శాతం సబ్సిడీతో బ్యాంక్ లింకేజీతో లోన్ ఇప్పించనుంది.
25 వేలకు పైగా అప్లికేషన్లు
ఆర్వైవీ స్కీమ్కు భారీ స్పందిన లభించింది. వంద శాతం సబ్సిడీతో రూ. లక్ష ఎకనామిక్ సపోర్ట్ కల్పించే చిన్న నీటి పారుదల యూనిట్లకు 60 ఏండ్ల వయసున్న రైతులు అప్లికేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. మిగిలిన యూనిట్లకు 55 ఏండ్లలోపు వయసున్న వారే అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. గడిచిన ఐదేండ్లలో ఎలాంటి లోన్లు తీసుకున్నా.. వారికి ఆర్వైవీలో స్కీమ్లో లోన్లు ఇవ్వరు. అయితే ప్రభుత్వం ప్రకటించిన ఈ స్కీమ్కు స్పందన బాగానే వస్తోంది.
Also REad :- పక్కా ఇండ్ల కోసం పడిగాపులు..పదేండ్లైనా తీరని తిప్పలు..!
చివరి తేదీ ఈ నెల 14 వరకూ ఉన్న ఇప్పటి వరకూ 25,262 మంది అప్లికేషన్లు చేసుకున్నారు. చివరి తేదీ నాటికి మరో 20 వేల అప్లికేషన్ల వరకూ వచ్చే అవకాశం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ నెల 15 నుంచి మే 20 వరకూ యూనిట్ల కోసం అప్లయ్ చేసుకున్న వారిలో అర్హులైన వారిని తొలుత మండల కమిటీ గుర్తించి, జిల్లా కమిటీకి సిఫారసు చేస్తుంది. మే 21 నుంచి మే 31 వరకూ ఈ జాబితాలో ఉన్న వారిని మరింత వడబోసి జిల్లా కమిటీ ఎంపిక చేస్తుంది. జూన్ 2న యూనిట్ల మంజూరు చేసిన వారికి ప్రొసిడింగ్స్ అందిస్తారు.
రూ. లక్షలోపు యూనిట్లకు ఆసక్తి చూపట్లే
ఆర్వైవీ స్కీమ్లో అప్లయ్ చేసుకుంటున్న వారు చిన్న యూనిట్ల ఏర్పాటు వైపు ఆసక్తి చూపడం లేదు. వంద శాతం సబ్సిడీతో ఇచ్చే రూ. 50 వేలు, 90 శాతం సబ్సిడీతో ఇచ్చే రూ. లక్షతో ఏర్పాటు చేసుకునే యూనిట్ల కోసం అప్లికేషన్లు చాలా తక్కువగా వస్తున్నాయి. ఇప్పటివరకూ మొత్తంగా 25,652 మంది అప్లయ్ చేసుకున్నారు. వీరిలో రూ. 50 వేలు, రూ. లక్షతో ఏర్పాటు చేసుకునే యూనిట్ల కోసం రెండు వేల మందికి పైగా అప్లికేషన్లు చేసుకున్నారు. వ్యవసాయానికి బోర్లు, బావుల తవ్వకం రూ. లక్ష లోన్ కోసం అప్లయ్ చేసుకన్న వారు 200 మందికి పైగా ఉన్నారు. అదే 80, 70 శాతం సబ్సిడీ అందించే రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల విలువైన యూనిట్ల లోన్ల కోసం 23 వేల మంది అప్లికేషన్లు చేసుకున్నారు.
వర్గాల వారీగా అప్లికేషన్ల సంఖ్య
ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ ముస్లీం క్రిస్టియన్ మొత్తం
6571 1712 15466 451 1022 40 25262
ఆఫ్లైన్లోనూ అప్లయ్ చేసుకోవచ్చు
ఆర్వైవీలో యూనిట్ల కోసం ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లోనూ అప్లయ్ చేసుకోవచ్చు. ఎంపీడీవో, మున్సిపాలిటీల్లో సేవ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఆన్లైన్లో అప్లయ్ చేసుకున్న వాళ్లు కూడా తమకు సంబంధించిన ధ్రువపత్రాలను, అప్లికేషన్ ఫారం సేవా కేంద్రాల్లో కచ్చితంగా ఇవ్వాలి. రూ. 50 వేలు, రూ. లక్ష యూనిట్ల కోసం అప్లికేషన్లు చాలా తక్కువగా వస్తున్నాయి. వీటికి అందరూ అప్లయ్ చేసుకోవాలి. జీ శ్యాంసుందర్, ఈడీ, ఎస్సీ కార్పోరేషన్