
బషీర్బాగ్, వెలుగు: కంచ గచ్చిబౌలి భూమి పై సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు బాగాలేదని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా అమ్ముతారని ప్రశ్నించారు. ఆదివారం బషీర్ బాగ్ దేశోద్ధారక భవన్ లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్, ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 400 ఎకరాల భూమి వేలం అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని విమర్శించారు.
ప్రశాంతమైన వాతావరణంలో ఉండే యూనివర్సిటీని బుల్డోజర్లతో యుద్ద వాతావరణం నెలకొల్పారని అన్నారు. ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూర్చుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయన్నారు. కానీ, జీవ వైవిధ్యాన్ని నాశనం చేసేలా ప్రకృతిని ధ్వంసం చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లను పరిగణలోకి తీసుకుని, ఆ భూమిని వర్సిటీకి అప్పగించాలన్నారు. సమావేశంలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జి.కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.