
బషీర్బాగ్, వెలుగు: బీసీలకు విద్య, ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్ తీర్మానించడాన్ని స్వాగతిస్తున్నామని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్ కాచిగూడలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో 215 బీసీ హాస్టల్స్, 320 బీసీ గురుకుల స్కూళ్లకు, హాస్టళ్లకు సొంత భవనాలు లేవని, వెంటనే వాటిని సొంత బిల్డింగ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వ భూములు అమ్మడాన్ని నిలిపివేసి, ఆ స్థలాల్లో గురుకులాల పాఠశాలలు, హాస్టల్స్ నిర్మించాలని కోరారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18, 19 తేదీల్లో ఢిల్లీలో జాతీయ మహిళా సదస్సు నిర్వహించనున్నామని, కేంద్ర మంత్రులు, మహిళా ఎంపీలు, బీసీ మహిళలు పాల్గొననున్నారని తెలిపారు.