ఇకనైనా నా పేరు ఎత్తకండి: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన రకుల్

ఇకనైనా నా పేరు ఎత్తకండి: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన రకుల్

యాక్టర్స్ నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తెలంగాణ స్టేట్ పాలిటిక్స్‎తో పాటు సినీ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ వల్లే సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్నారంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గౌరవప్రదమైన మంత్రి హోదాలో ఉండి వ్యక్తిగత జీవితాలపై అసభ్యకరమైన విమర్శలు చేయడం ఏంటని పలువురు మండిపడుతున్నారు. 

టాలీవుడ్‎కు చెందిన ప్రముఖులు ఇప్పటికే కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించగా.. మంత్రి సురేఖ తమ ఫ్యామిలీ గౌరవానికి భంగం కలిగించారంటూ నాగార్జున కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో మంత్రి సురేఖపై నాగ్ పరువు  నష్టం దావా వేశారు. ఇదిలా ఉండగా.. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పందించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయిన రకుల్.. కొండా సురేఖ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు.

 

 

ALSO READ | మంత్రి కొండా సురేఖ V/s సినీ ఇండస్ట్రీ..

‘‘తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. నేను ఈ అందమైన పరిశ్రమలో గొప్ప ప్రయాణం చేశాను. ఇప్పటికీ టాలీవుడ్‎తో కనెక్ట్ అయి ఉన్నాను. సినీ పరిశ్రమకు చెందిన మహిళలపై ఇలాంటి నిరాధారమైన, దుర్మార్గపు పుకార్లు వ్యాప్తి చెందడం బాధాకరం. మరింత నిరుత్సాహపరిచే విషయం ఏమిటంటే చాలా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మరొక మహిళ ఇలాంటి ఆరోపణలు చేయడం. గౌరవం కోసం మనం మౌనంగా ఉంటే అది మన బలహీనతగా తప్పుగా భావిస్తున్నారు. నేను పూర్తిగా రాజకీయ వ్యతిరేకిని.. ఏ వ్యక్తి/రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదు. మీ రాజకీయ మైలేజీ కోసం నా పేరును దురుద్దేశపూర్వకంగా ఉపయోగించడం ఇకనైనా మానేయాలని కోరుతున్నాను’’ అని ట్వీట్ చేసింది రకుల్.