రామగుండం ఎయిర్ పోర్టుపై చిగురిస్తున్న ఆశలు

రామగుండం ఎయిర్ పోర్టుపై  చిగురిస్తున్న ఆశలు
  • పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ లేఖతో  రీ సర్వేకు కేంద్రమంత్రి ఆదేశాలు
  •  బసంత్​ నగర్, అంతర్గాం ప్రాంతాల్లో భూములను పరిశీలించిన ఏఏఐ బృందం   
  • ఎయిర్ పోర్టుకు సమీపంలోనే రోడ్డు, రైలు కనెక్టివిటి సౌకర్యాలు
  • అందుబాటులోకి వస్తే సమీప పట్టణాలకు ప్రజలకు ఈజీ జర్నీ

గోదావరిఖని, వెలుగు :  రామగుండం ఎయిర్​పోర్టు ఏర్పాటుపై ఆశలు చిగురించాయి. ఇప్పటికే దీనిపై  పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్​నాయుడును కలిసి వినతిపత్రం అందించారు. దీంతో ఎయిర్​పోర్ట్ అథారిటీ ఆఫ్​ఇండియా (ఏఏఐ) డీజీఎం మల్లిక ఆధ్వర్యంలోని అధికారుల బృందం రామగుండం సెగ్మెంట్ లోని బసంత్​ నగర్, అంతర్గాం ప్రాంతాల్లోని భూములను రీ సర్వే చేసింది.

1972లోనే ఎయిర్​లైన్స్​ సర్వీసులు..

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం (పూర్వ రామగుండం) పరిధిలోని బసంత్​నగర్​లో కేశోరామ్ ​సిమెంట్​ ఫ్యాక్టరీ ఏర్పాటైంది. కాగా సంస్థ అధినేత బీకే బిర్లా తన ప్లాంట్​ను సందర్శించేందుకు1972లోనే 294 ఎకరాల్లో ఎయిర్ పోర్టును నిర్మించారు. హైదరాబాద్​నుంచి ఇక్కడికి ‘వాయుదూత్​ఎయిర్​ లైన్స్’ పేరుతో 21 సీట్ల చిన్న విమానాలు రాకపోకలు సాగించేవి. ఆ తర్వాత కొంత కాలానికి సర్వీస్​లను నిలిపివేశారు. 2017 లో కేంద్ర ప్రభుత్వం ‘ ఉడో దేశ్​కీ హమ్ నాగరిక్ (ఉడాన్​) స్కీమ్​ తెచ్చాక  బసంత్​నగర్​ఎయిర్​పోర్టును విస్తరిం చాలనే ప్రతిపాదన వచ్చింది. అందుకు 2020 సంవత్సరం నుంచి ఇక్కడ ఎయిర్​పోర్టు నిర్మాణానికి టెక్నికల్,  భౌగోళిక సర్వేలను ఎయిర్​పోర్ట్​అథారిటీ ఆఫ్​ఇండియా (ఏఏఐ) చేపడుతోంది.  

 ఆ రెండు ప్రాంతాల్లో భూముల గుర్తింపు

పాలకుర్తి మండలంలోని బసంత్​నగర్​లో ఎయిర్​పోర్టు వద్ద ఇప్పటికే 300 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. ఇక్కడ రన్​వే ఉండగా, మరో 60 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. ఇదికాకుండా అంతర్గాం మండల కేంద్రం నుంచి రాయదండి గ్రామానికి వెళ్లే మధ్యలో సుమారు 500 ఎకరాలు అందుబాటులో ఉన్నట్టు అధికారులు గుర్తించారు.  రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్​ ఫీల్డ్ ఎయిర్​పోర్ట్(జీఎఫ్​ఏ) కింద క్లియరెన్స్​ఇచ్చిన తర్వాత ఎక్కడ అనువుగా ఉంటుందనే విషయాలపై ఏఏఐ ఆఫీసర్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 

 హైటెన్షన్​ వైర్లు, గుట్టలను తొలగిస్తే.. 

 బసంత్​నగర్​రన్​వే ఏరియాలోని విద్యుత్ హైటెన్షన్​ వైర్లతో పాటు కన్నాల గ్రామ పరిధిలోని బోడగుట్ట గుట్టలు అడ్డంకిగా మారుతాయనే అభిప్రాయానికి ఏఏఐ ఆఫీసర్లు వచ్చినట్టు తెలిసింది. హైటెన్షన్​వైర్లను మరో మార్గం ద్వారా పంపించడంతో పాటు గుట్టలను తొలగిస్తే ఇక్కడే ఎయిర్​పోర్టు ఏర్పాటు బెటర్​ అనేది రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏఏఐ బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఎయిర్​పోర్టు స్థలానికి రోడ్డు, రైలు కనెక్టివిటీ అతి సమీపంలో ఉండగా ఈజీగా ప్యాసింజర్లు ఎయిర్ పోర్టుకు చేరుకునే అవకాశం ఉంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఒకవేళ బసంత్​నగర్​లో ఎయిర్​పోర్టు సాధ్యం కాకుండా అంతర్గాం -– రాయదండి గ్రామాల మధ్యలోని స్థలంలోనూ నిర్మించే చాన్స్ ఉంటుంది. 

రామగుండంలో ఎయిర్​పోర్టు ఎంతో అవసరం 

రామగుండం ప్రాంతంలో ఎయిర్​పోర్టు అవ సరం ఎంతో ఉంది. ఇక్కడ సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్​సీఎల్, జైపూర్​ఎస్టీపీపీ, బసంత్​నగర్​సిమెంట్​ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆయా పరిశ్రమల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు చాలా మంది పని చేస్తున్నారు.   ఈ ప్రాంతం నుంచి విదేశాలకు కూడా ఎక్కువ మంది జాబ్ లు, స్టడీస్  కోసం వెళ్తుంటారు. పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్​ వంటి పట్టణాల నుంచి  విమాన సర్వీసుల కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్​కు వెళ్తుంటారు. రామగుండంలో ఎయిర్​పోర్టు ఉంటే ఆయా ప్రాంతాలవారికి సమయం ఆదాతో పాటుప్రయాణం ఈజీ అవుతుంది. రోడ్డు, రైలు కనెక్టివిటీ ఉండడంతో సమీప రాష్ట్రాలకు వెళ్లే వారికి కూడా ఎయిర్​ పోర్టు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. రామగుండంలో ఎయిర్​ పోర్టు ఏర్పాటుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్​నాయుడుకు లేఖ అందజేసి వివరించాను. స్పందించిన కేంద్ర మంత్రి ఆదేశాలతో బసంత్​నగర్, అంతర్గాంలో భూముల రీ సర్వే చేపట్టింది. త్వరగా ఎయిర్​పోర్టుకు అనుమతి ఇచ్చే లా మరోమారు కేంద్ర మంత్రిని కలిసి కోరు తాను. 
-  గడ్డం వంశీకృష్ణ, పెద్దపల్లి ఎంపీ