
నాగ్పూర్: దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మేటి జట్టును తేల్చే సమయం ఆసన్నమైంది. 90వ ఎడిషన్ రంజీ ట్రోఫీలో చాంపియన్గా నిలిచేందుకు మాజీ విన్నర్ విదర్భ, తొలిసారి తుదిపోరుకు వచ్చిన కేరళ బుధవారం మొదలయ్యే మెగా ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. సూపర్ ఫామ్లో ఉన్న విదర్భ సొంతగడ్డపై అనుకూలతలను ఉపయోగించుకొని మూడోసారి ట్రోఫీని మరోసారి కైవసం చేసుకోవాలని చూస్తోంది. అక్షయ్ వాడ్కర్ కెప్టెన్సీలోని ఆ జట్టు ఈ సీజన్లో ఆడిన 9 మ్యాచ్ల్లో 8 గెలిచి జోరు మీద ఉంది.
2017–18, 2018–19 ఎడిషన్లలో విజేతగా నిలిచిన విదర్భ గత సీజన్ ఫైనల్లో ముంబై చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. పట్టు వదలకుండా మరోసారి తుదిపోరుకు వచ్చిన ఆ టీమ్ ఈ ఫార్మాట్లో అద్భుతమైన నిలకడ చూపెడుతోంది. యష్ రాథోడ్ 9 మ్యాచ్ల్లో 933 రన్స్తో సూపర్ ఫామ్లో ఉన్నాడు. కెప్టెన్ వాడ్కర్ (674), వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ (642), డానిశ్ మలేవార్ (557), ధ్రువ్ షోరే (446) జోరు మీదున్నారు. ఆ టీమ్ స్పిన్నర్ హర్ష్ దూబే (66 వికెట్లు) ఒక రంజీ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచేందుకు కేవలం మూడు వికెట్ల దూరంలో నిలిచాడు.
మరోవైపు ప్రతిభకు అదృష్టం కూడా తోడవ్వడంతో సచిన్ బేబీ కెప్టెన్సీలోని కేరళ తొలిసారి ఫైనల్కు వచ్చింది. క్వార్టర్స్లో, సెమీఫైనల్లో ఆ జట్టుకు అదృష్టం కలిసొచ్చి తొలి ఇన్నింగ్స్లో వరుసగా 1, 2 పరుగుల ఆధిక్యం అందుకొని ముందుకొచ్చింది. ఆ టీమ్లో సల్మాన్ నిజార్ (607), మహ్మద్ అజరుద్దీన్ (601) బ్యాటింగ్లో సత్తా చాటుతుండగా.. బౌలింగ్లో జలజ్ సక్సేనా (38 వికెట్లు), ఆదిత్య సర్వాటే (30 వికెట్లు) రాణిస్తున్నారు.