న్యూఢిల్లీ : ఓ ర్యాన్సమ్వేర్ ఎటాక్తో దేశంలోని 300 చిన్న బ్యాంకులు తమ ఆన్లైన్ పేమెంట్ సర్వీస్లను షట్డౌన్ చేసుకోవాల్సి వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, బ్యాంకింగ్ టెక్నాలజీ సర్వీస్లను అందించే సీ–ఎడ్జ్ టెక్నాలజీస్ సైబర్ ఎటాక్కు గురైంది. దీంతో 300 కో–ఆపరేటివ్, రీజినల్ బ్యాంకుల కస్టమర్లు ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రా చేసుకోలేకపోయారు. మరికొంత మంది యూపీఐ, ఆర్టీజీఎస్ సర్వీస్లను వాడుకోలేకపోయారు. ఇతర బ్యాంకింగ్ సర్వీస్లకు ఎటువంటి అంతరాయం కలగలేదని ఈ రిపోర్ట్ పేర్కొంది.
‘సీ–ఎడ్జ్ టెక్నాలజీస్ ర్యాన్సమ్వేర్ ఎటాక్కు గురైనట్టు ఉంది. దీంతో కొన్ని సర్వీస్లకు అంతరాయం ఏర్పడింది’ అని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. ఫలితంగా ఎన్పీసీఏ అందిస్తున్న సర్వీస్లను సీ–ఎడ్జ్ యాక్సెస్ చేయలేకపోయిందని తెలిపింది. గుజరాత్లోని 17 డిస్ట్రిక్ట్ కో–ఆపరేటివ్ బ్యాంకులతో సహా సీ–ఎడ్జ్ టెక్నాలజీస్పై ఆధారపడుతున్న మొత్తం 300 చిన్న బ్యాంకులు గత రెండుమూడు రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని నేషనల్ కో–ఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా చైర్మన్ దిలీప్ సంఘాని అన్నారు.
ఆర్టీజీఎస్, యూపీఐ పేమెంట్స్ వంటి అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్లకు అంతరాయం ఏర్పడిందని చెప్పారు. పంపిన డబ్బులు కట్ అయ్యాయి. కానీ రిసీవర్ అకౌంట్లో క్రెడిట్ కాలేదని వివరించారు. ఎస్బీఐ, టీసీఎస్ల జాయింట్ వెంచర్ కంపెనీ అయిన సీ–ఎడ్జ్ కో–ఆపరేటివ్ బ్యాంకులు, రీజినల్ బ్యాంకులకు టెక్ సర్వీస్లను అందిస్తోంది. సైబర్ ఎటాక్ను రెండు రోజుల కిందట గుర్తించామని, సీ–ఎడ్జ్ సిస్టమ్ను బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి వేరు చేశామని కంపెనీ అధికారిక ప్రకటనలో పేర్కొంది.