
వనపర్తి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పంపిణీలో రేషన్ డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. లబ్ధిదారుడి సంచితో పాటు గోనె సంచిని ఎలక్ట్రానిక్ కాంటాపై పెట్టి తూకం వేస్తున్నారు. నలుగురు సభ్యులు ఉన్న కార్డుదారుడికి ఇలా కిలో వరకు తక్కువ బియ్యం ఇస్తున్నారు. ఇదేమని నిలదీస్తే తమకు వచ్చే బియ్యం సంచుల్లో నాలుగైదు కిలోల వరకు తరుగు వస్తోందని, ఆ నష్టాన్ని భరించేందుకు ఇలా చేస్తున్నామని చెబుతున్నారు.
పక్కదారి పట్టే అవకాశం లేకనే..
గతంలో రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే దొడ్డు బియ్యాన్ని ఎక్కువ శాతం మంది లబ్ధిదారులు డీలర్లకు కిలో రూ.10కి అమ్ముకునేవారు. అలా అమ్మేవారి లిస్ట్ తయారు చేసి కార్డుదారుల వేలిముద్రలు వేయించుకొని డబ్బులు ఇచ్చేవారు.
ఆ బియ్యాన్ని కిలో రూ.22 చొప్పున రీసైక్లింగ్ చేసే రైస్ మిల్లులకు అమ్ముకునేవారు. ప్రస్తుతం సన్న బియ్యం పంపిణీ చేస్తుండడం, వాటిని లబ్ధిదారులు తీసుకోవడంతో బియ్యాన్ని పక్కదారి
పట్టించే అవకాశం లేకుండాపోయింది. దీంతో డీలర్లు తరుగు పేరుతో కోతలు పెడుతూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇలా క్వింటాలు బియ్యం పంపిణీ చేస్తే అందులో 5 కిలోల వరకు
కాజేస్తున్నారు.
ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లాం..
ప్రతి నెలా వచ్చే బియ్యం సంచుల్లో రెండు, మూడు కిలోల దాకా తరుగు వస్తోంది. లోడింగ్, అన్ లోడింగ్ సమయంలోనూ కొంత లాస్ వస్తోంది. తరుగు రాకుండా చూడాలని ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్తే, తూకం వేసి సప్లై చేస్తామని చెబుతున్నా, అలా జరగడంలేదు. ఆఫీసర్లు తరుగు రాకుండా చూస్తే ఈ సమస్య ఉండదు.- బచ్చురాము, రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు, వనపర్తి