T20 World Cup 2024 Final: 15 ఏళ్ళ ప్రయాణానికి గుడ్ బై: అంతర్జాతీయ టీ20లకు జడేజా రిటైర్మెంట్

T20 World Cup 2024 Final: 15 ఏళ్ళ ప్రయాణానికి గుడ్ బై: అంతర్జాతీయ టీ20లకు జడేజా రిటైర్మెంట్

వెస్టిండీస్ వేదికగా సౌతాఫ్రికాపై భారత్ వరల్డ్ కప్ ఫైనల్లో గెలిచిన తర్వాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ 20 లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరి బాటలోనే మరో సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రపంచ కప్ ట్రోఫీతో ఉన్న తన చిత్రాన్ని పోస్ట్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని  ధృవీకరించాడు.

సంతోషంతో నేను టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు వీడ్కోలు పలుకుతున్నాను. నా దేశం కోసం అత్యున్నత ప్రదర్శన ఇచ్చాను. వన్డే, టెస్ట్ ఫార్మాట్ లలో కొనసాగుతా. టీ20 ప్రపంచకప్‌ గెలవాలనే నా కల నిజమైంది. నా ప్రయాణంలో మద్దతుగా నిలిచిన వారికి  ధన్యవాదాలు". అని జడేజా తెలిపాడు. శనివారం (జూన్ 29) విండీస్ వేదికగా ముగిసిన వరల్డ్ కప్ లో జడేజా ఆకట్టులేకపోయాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో దారుణంగా విఫలమయ్యాడు. అయితే భారత్ వరల్డ్ కప్ గెలవడంతో సంతోషంతో జడేజా తన అంతర్జాతీయ  టీ20 కెరీర్ ను ముగించాడు. 

ధోనీ నాయకత్వంలో జడేజా ఫిబ్రవరి 2009లో శ్రీలంకపై అరంగేట్రం చేశాడు. 15 ఏళ్ళ తన టీ20 క్రికెట్ లో జట్టు ఆల్ రౌండర్ గా సత్తా చాటాడు. మొత్తం 74 టీ20 మ్యాచ్ ల్లో 515 పరుగులు చేసిన ఈ స్పిన్ ఆల్ రౌండర్ బౌలింగ్ లో 54 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తన చివరి టీ20 మ్యాచ్ లో జడేజా 2 పరుగులే చేశాడు. ఇక బౌలింగ్ లో ఒక ఓవర్ వేసి 12 పరుగులు సమర్పించుకున్నాడు.