IND vs NZ 2nd Test: రెప్పపాటులో జడేజా మ్యాజిక్.. ధోనీ స్టైల్లో రనౌట్

IND vs NZ 2nd Test: రెప్పపాటులో జడేజా మ్యాజిక్.. ధోనీ స్టైల్లో రనౌట్

టీమిండియా ఆల్ రౌండర్ రవీద్ర జడేజా ఒక అద్భుత రనౌట్ చేశాడు. మెరుపు త్రో వేసి రనౌట్ చేయడం చాలా సార్లు చూసినా ఇది మాత్రం స్పెషల్. అసలు విషయానికి వస్తే ఇన్నింగ్స్ 70 ఓవర్లో మూడో బంతికి జడేజా బౌలింగ్ లో గ్లెన్ ఫిలిప్స్ భారీ సిక్సర్ కొట్టి దూకుడు మీదున్నాడు. ఆ తర్వాత  వేసిన నాలుగో బంతిని సైతం కవర్స్ మీదుగా గట్టిగా షాట్ ఆడాడు. బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సుందర్ త్రో నేరుగా జడేజాకు విసిరాడు. ఈ దశలో జడేజా నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో విల్ ఓ'రూర్క్ ను ఔట్ చేసేందుకు తన తెలివిని ప్రదర్శించాడు. 

బంతిని అందుకొని కొడితే సమయం వృధా అవుతుందని భావించి.. రెప్పపాటు వ్యవధిలో బంతిని పూర్తిగా చేతిలోకి తీసుకోకుండానే  వికెట్లకు విసిరాడు. అప్పీల్ చేయగా రిప్లేలో ఔట్ అని తేలింది. దీంతో కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది. జడేజా చేసిన ఈ రనౌట్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని గుర్తు చేసింది. మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఇలా ఎన్నో సార్లు ధోనీ వికెట్లను చూడకుండానే బంతిని స్టంప్స్ పైకి విసిరేవాడు. ధోనీ, జడేజా ఇద్దరూ టీమిండియాతో పాటు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడారు. 

వీరిద్దరి మధ్య చక్కని అనుబంధం ఉందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీని తరహాలోనే రనౌట్ చేయడంతో ధోనీ ఫ్యాన్స్ జడేజాను తెగ పొగిడేస్తున్నారు. ప్రస్తుతం ఈ రనౌట్ వైరల్ అవుతుంది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మూడో రోజు తొలి సెషన్ లో వికెట్ నష్టానికి 12 ఓవర్లలోనే 81 పరుగులు చేసింది. క్రీజ్ లో జైశ్వాల్ (46), గిల్ (22) ఉన్నారు. భారత్ విజయానికి మరో 278 పరుగులు కావాలి. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి.