
- నల్లమల తిరుపతిగా ప్రసిద్ధి - దళితులే పూజారులు
అమ్రాబాద్, వెలుగు: నల్లమల తిరుపతిగా పేరుగాంచిన రాయలగండి లక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ రూ. 61 లక్షలు తన నిధులు మంజూరు చేయడంతో ఆలయం పైకి సీసీ రోడ్లు, విద్యుత్ లైట్లు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో దళితులే అర్చకులుగా ఉన్న దేవాలయాల్లో రాయలగండి ప్రధానమైనది. లక్ష్మి చెన్నకేశవ స్వామి జాతర ఉత్సవాల సందర్భంగా 3న సాయంత్రం 6 గంటలకు అచ్చంపేట పట్టణం నుంచి ఉత్సవ విగ్రహాలను ఆలయానికి మంగళవారం తెల్లవారుజామున ఆలయానికి తీసుకువస్తారు. 4న స్వామి కల్యాణం మహోత్సవం, 5న అమ్రాబాద్, పదర మండలాల నుంచి ప్రభల రాక, సంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.
జాతర వేడుకల సందర్భంగా రాష్ట్ర స్థాయి వాలీబాల్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా రూ. ముప్పై వేలు అందజేస్తారు. ఈ మహోత్సవానికి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరవుతున్నట్లు సమాచారం.