Ambati Rayudu: పబ్లిసిటీ కోసం వెళ్తారు.. సినీ సెల‌బ్రిటీల‌పై రాయుడు జోకులు

Ambati Rayudu: పబ్లిసిటీ కోసం వెళ్తారు.. సినీ సెల‌బ్రిటీల‌పై రాయుడు జోకులు

ఛాంపియన్‌ ట్రోఫీలో భాగంగా ఆదివారం(ఫిబ్రవరి 2023) ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. చిరకాల ప్రత్యర్థులు తలపడిన ఆ మ్యాచ్‌ను చూసేందుకు పలువురు తెలుగు రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు దుబాయి వెళ్లారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ సుకుమార్‌.. అతని కుటుంబ సభ్యులు, ఏపీ మంత్రి నారా లోకేష్, ఎంపీ కేశినేని నాని వంటి పలువురు ఉన్నారు.

వెళ్లిన వారు ప్రముఖులు కావడంతో కెమెరామెన్లు వాళ్లని బాగానే ఫోకస్‌ చేశారు. తెలుగు అభిమానులను దృష్టిలో పెట్టుకొని పదే పదే స్క్రీన్స్‪పై చూపెట్టారు. ఆ సమయంలో తెలుగు కామెంటరీ బాక్సులో కూర్చున్న మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.. కాస్త అత్యుత్సాహం చూపాడు. సెలెబ్రిటీలను ఉద్దేశించి కఠినంగా మాట్లాడాడు.

మ్యాచ్ జ‌రుగుతున్న సమయంలో స్క్రీన్‌పై సుకుమార్ క‌నిపించ‌గానే ప్రైడ్ ఆఫ్ తెలుగు అని పుష్ప సినిమాను ఉద్దేశించి ఓ కామెంటేట‌ర్ అనగా.. రాయుడు మాత్రం "ఇదంతా పబ్లిసిటీ స్టంట్‌" అన్నాడు. ‘ఇదంతా పబ్లిసిటీ స్టంట్‌.. ఇండియా పాకిస్తాన్‌ మ్యాచ్‌కు వస్తే టీవీలో ఎక్కువసార్లు చూపిస్తారు కదా..’ అని సెటైర్లు వేశారు. ఈ వ్యాఖ్యలు నెటిజన్లకు ఆగ్రహాన్ని  తెప్పించాయి.

హీరోగా చిరంజీవి సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకోగా.. దేశంలోనే అగ్ర దర్శకుల్లో ఒకరుగా సుకుమార్‌ పేరు సంపాదించుకున్నారు. వీరికి పబ్లిసిటీ అవసరమా..! అని వారి వారి అభిమానులు రాయుడిని ప్రశ్నిస్తున్నారు. తెలుగువాడు అయ్యుండి, సాటి తెలుగువాళ్లపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరైనదేనా అని మాజీ క్రికెటర్‌పై మండి పడుతున్నారు. ఏదో పొడుస్తానని రాజకీయాల్లోకి వచ్చిన రాయుడు.. ఏం పొడిచాడని అతని రాజకీయ జీవితంపైనా కామెంట్లు చేస్తున్నారు.