Razakar Movie Review: రజాకార్ రివ్యూ..తెలంగాణ వీరుల పోరాటం ఎలా ఉందంటే?

Razakar Movie Review: రజాకార్ రివ్యూ..తెలంగాణ వీరుల పోరాటం ఎలా ఉందంటే?

బాబీ సింహా, వేదిక, అనుష్యా త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, అనసూయ మకరంద్‌ దేశ్‌ పాండే ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘రజాకర్‌’ (Razakar). యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఇవాళ మార్చి 15న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రాజ‌కీయంగా ఎన్నో వివాదాల‌కు కేంద్రంగా నిలిచిన ఈ చిత్రం ఎన్నో అడ్డంకులను దాటి థియాటర్లోకి వచ్చిన ఈ చిత్రంలో తెలంగాణా పోరాట యోధుల జీవితాలను ఎలా చూపించారు? అందులో వివాదాస్పదమైన అంశాలు ఏమైనా ఉన్నాయా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

రజాకార్ అనే ఒక విప్లవ పదం వెనుక తెలంగాణ సాయుధ పోరాట గాథలెన్నో కనిపిస్తాయి. ఇక కనిపించని మరెన్నో వెతలను, సామాన్యులు అనుభవించిన వేదనలను చూపించడానికి వచ్చిన మూవీ రజాకార్‌. ఇప్పుడు తెలంగాణ చరిత్రను తెలుసుకోవడం చాలా అవసరం అంటూ రైటర్.. డైరెక్టర్ యాట సత్య నారాయణ రజాకార్‌ మూవీను తెరకెక్కించారు. 

కథేంటంటే: 

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా హిందూ జనాభాపై రజాకార్లు చేసిన అకృత్యాలను, అన్యాయాలను చరిత్రలో తెలంగాణా బిడ్డల బాధలు, వారి త్యాగాలు..ఈ గడ్డ కోసం పోరాడిన వాళ్ల చరిత్ర చెప్పడానికే ఈ సినిమా తీస్తున్నట్లు దర్శక నిర్మాతలు మొదటి నుంచి చెప్పుకొచ్చారు. అలాగే రజాకార్ల దాడి నేపథ్యంలో ఈ సినిమా కథనం అంతా సాగుతుంది. భారత దేశానికి 1947 ఆగస్ట్‌ 15న స్వాతంత్య్రం వస్తే..హైదరాబాద్‌ సంస్థానానికి మాత్రం 1948 సెప్టెంబర్‌ 17వరకు రాలేదు. అలా భార‌త‌దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చినా కూడా హైద‌రాబాద్ సంస్థానం మాత్రం నిజాం ఏడో రాజు అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (మ‌క‌రంద్ దేశ్ పాండే) ఏలుబ‌డిలో ఉన్న రోజుల‌వి. అందువలన హైదరాబాద్‌ (నైజాం)ని భారత్‌లో విలీనం చేయడానికి నిజాం ఏడవరాజు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ఈ మాత్రం ఒప్పుకోడు.

నైజాం సంస్థానాన్ని పూర్తిగా తుర్కిస్తాన్‌గా మార్చి తనదైన పంథాలో రాజ్యం ఏర్పాటు చేసుకుని ఓ ప్రత్యేక దేశంగా తనకు తాను ప్రకటించుకొని ఇష్ట రాజ్యాంగా  పాలించుకోవాలని ప్రయత్నిస్తాడు. అలా నిజాం పాలనలో రజాకార్ల రాక్షసత్వానికి అంతేలేకుండా పోయింది. నిజాం పాలనకి వ్యతిరేకంగా పని చేసే అనామకులని..పెద్దవాళ్ళని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేసేవారు. పన్నులు, ప్రజల ఆస్తుల్ని దోచుకోవడంతో పాటు..ఇక ఇళ్లలోకి చొరబడి మహిళలపై అత్యాచారాలకు తెగపడేవారు.అంతేకాకుండా దీనికోసం ర‌జాకార్ల చీఫ్ ఖాసిం రిజ్వీ (రాజ్ అర్జున్‌).. అప్ప‌టి నిజాం ప్ర‌ధాని లాయ‌క్ అలీ ఖాన్ (జాన్ విజ‌య్‌) ఓ పెద్ద కుట్ర‌కు తెర‌లేపుతారు. 

నైజాం ప్రాంతంలోని ప్రజలందరిని..ఇష్టా ఇష్టాలతో సంభంధం లేకుండా బలవంతంగా మతం మార్పిడి చేయించి.. ఒకే మతానికి చెందిన దేశంగా మార్చాలని భావిస్తాడు. ఇందుకుగాను ఖాసీం రజ్వీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రజాకార్ల వ్యవస్థను ఉపయోగిస్తాడు. ఖాసీం రజ్వీ తన సైన్యంతో చేసే ఆగడాలు..అరచకాలు రోజు రోజుకి మితిమీరిపోతాయి.

1948 ఆగస్టు 27న ఖాసీం రజ్వీ నాయకత్వంలో బైరాన్‌పల్లిని చుట్టుముట్టిన 400 మంది రజాకార్లు భయంకరమైన నరమేధం సృష్టించారు. 118 మంది ప్రాణాలను అన్యాయంగా  బలిగొన్నారు. అలా మతం మార్పిడి కోసం ప్రజలను అతిదారుణంగా హింసిస్తాడు. అలాగే శిస్తు కట్టలేదని కూడా అందరినీ కొట్టి చంపుతాడు. ఈ క్రమంలో ఐలమ్మ (ఇంద్రజ),గూడూరు నారాయణ, రాజిరెడ్డి (బాబీ సింహా) తో పాటు చాలామంది రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేయడం మొదలుపెడతారు. అలా విరోచితమైన పోరాటం చేసి వీరమరణం పొందుతారు.

అయితే అప్ప‌టి భార‌త హోంమంత్రి అయిన స‌ర్దార్ వ‌ల్ల‌భభాయ్ ప‌టేల్ (రాజ్ స‌ప్రు) నిజాం దురాగ‌తాలు,ప్రజలని హింసించడానికి పన్నిన తతంగాలు ఒక్కొక్కటిగా తెలుసుకుని హైద‌రాబాద్ సంస్థానాన్ని భార‌త్‌లో విలీనం చేసేందుకు పోలీస్ చ‌ర్య‌కు సిద్ధ‌ప‌డ‌తారు. అందుకు 'ఆపరేషన్ పోలో’ ప్రవేశపెడతారు.

హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనం కావడం ఖాయమైంది.అయితే వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రధానమంత్రి నెహ్రు ఏం చేశాడు? నిజాం ప్ర‌భువు నుంచి స్వాతంత్ర్యం సాధించే క్ర‌మంలో తెలంగాణ ప్ర‌జ‌లు ఎలాంటి పోరాటం చేశారు? మరి ఈ వీరోచిత పోరాటంలో ఎవరెవరు వీరమరణం పొందారు? మరి చివరకు నిజాం రాజుయే స్వయంగా వచ్చి హైదరాబాద్‌ని భారత్‌లో విలీనం చేస్తున్నానని ప్రకటించేలా నిర్ణయం తీసుకోవడానికి వెనుకున్నది ఎవరు? ఆపరేషన్ పోలో వాళ్ళ ఎలాంటి ఫలితం వచ్చింది? ఇక చరిత్రలోని వివరాలు..భాధలు..అన్యాయాలు తదిరత విషయాలు తెలియాలంటే ‘రజాకార్‌’ సినిమా తెరపై చూడాల్సిందే. 

ఎలా సాగిందంటే:

జీవితంలో పుట్టాం కాబట్టి ఎలాగైనా బతకాలి..ఇక చచ్చేవరకూ ఉండాలనే పరిస్థితుల్లో మతోన్మాద అరాచకాలకు దర్పణంగా..తెలంగాణ సాయుధ పోరాటంలో రక్త చరిత్రకి అద్దం పట్టేలే తెరకెక్కించిన చిత్రం రజాకార్ అని చెప్పుకోవొచ్చు. అందుకే ప్రపంచ చరిత్రలోని పోరాట గాథల్లో తెలంగాణ సాయుధ పోరాటానికి తరాలు కూడా చెప్పుకునేంతగా చరిత్ర ఉంది. అయితే ఇక్కడ రజాకార్ మూవీలో..రజాకార్ల దాడి, వారు చేసిన ఆకృత్యాలు తలుచుకుంటే..వాటి నుంచి బయటపడేలా ముందుకొచ్చింది మాత్రం..కమ్యునిస్టులు అనే విషయం మాత్రం తప్పక గుర్తొస్తుంది. కానీ ఈ సినిమాలో మాత్రం వారిని హైలెట్‌ చేసి చూపించలేదు. పైగా రజాకార్ల వ్యవస్థను అంతం చేసేందుకు బయలుదేరిన భారత సైన్యాన్నికి తెలంగాణ ప్రజలంతా మద్దతుగా నిలిస్తే..ఆ సమయంలో కమ్యునిస్టులు పూర్తిగా సైలెంట్‌ అయిపోయినట్లుగా ఓ డైలాగుతో చెప్పించారు. కానీ చివరిలో మాత్రం ఓ పాటతో కమ్యునిస్టులు చేసిన పోరాటాలను గుర్తు చేసి చూపించారు. 

గ్రామాల్లో ర‌జాకార్లు చేసిన దురాగ‌తాల‌కు బలియిన వారిని..ఎంతకైతే అంత రజాకార్లపై ఎదిరించి పోరాడే క్ర‌మంలో ప్ర‌జ‌లే సాయుధులై కదిలిన తీరుని..అందుకుని ఈ సాయుధ పోరాటంలో వీర‌మ‌ర‌ణం పొందిన వేలాది యోధుల క‌థ‌లు చరిత్రలో నిలిచిపోయేలా భావోద్వేగమైన అంశాలతో చూపించారు. 

సినిమా మొదలయిన కానుంచి ర‌జాకార్ల దుశ్చ‌ర్య‌ల‌ను ఒక్కొక్కటిగా ప‌రిచ‌యం చేస్తూ సినిమాని ఆస‌క్తిక‌రంగా తెరకెక్కించారు. 
ప్రతి 15 నిమిషాలకు ఒకసారి కొత్త పాత్రని తెరపైకి తీసుకురావడం..వారికి బలమైన ఎలివేషన్‌ తో పాటు యాక్షన్‌ సీన్స్‌ ఇవన్నీ ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. అప్ప‌ట్లో త‌బ్లిగ్ ఫ‌ర్మానా పేరుతో ర‌జాకార్లు ప్ర‌జ‌ల్ని బ‌ల‌వంతంగా మ‌త‌మార్పిడి చేయించిన తీరు.. తెలుగు భాష మాట్లాడుతున్నార‌న్న అక్క‌సుతో బ‌డుల్లో పిల్ల‌ల‌పై వారు చేసిన దారుణాలు.. ఊళ్లలో మ‌హిళ‌లు, ఆడ‌పిల్ల‌ల‌పై ర‌జాకార్లు చేసిన విషయాలు కళ్ళకు కట్టినట్లు చూపించారు. అలాగే వెయ్యి ఉరిల మర్రి చరిత్ర, పరకాల హింసకాండ, బైరాన్‌పల్లి మారణహోమం..లాంటి సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను బరువెక్కిస్తాయి. అలా మధ్యలో వచ్చే అనసూయ బతుకమ్మ పాట ద్వారా చరిత్ర గురించి చెప్పే విషయాలు ఫస్టాఫ్ లో హైలెట్ గా నిలుస్తాయి. 

ఇక సెకాండఫ్ విషయానికి వస్తే..వచ్చే ప్రతి ఎపిసోడ్ లో ఎపిసోడ్ల‌లో ర‌జాకార్ల అకృత్యాలు చూస్తున్నప్పుడు..ఇంతలా అప్పట్లో ఏమి తెలియని అమాయకుల జీవితాలను అస్తవ్యస్తంగా చేసిన వీరిపై నిజంగా మ‌న‌మే తిర‌గ‌బ‌డాల‌న్నంత ఆవేశం క‌లిగించేలా ప్రతి సీన్ ఉంటుంది. రజాకార్ సినిమా ఎండింగ్ లో వచ్చే పాట తెలంగాణ సాయుధ పోరాట యోధుల్ని తలుచుకునేలా ఆకట్టుకుంటుంది. 

ఎవ‌రెలా చేశారంటే: 

ఈ సినిమాలో చేసిన ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది. ఇందులో హీరో అనేది ఎవరుండరు. వచ్చే ప్రతి క్యారెక్టర్ చాలా శక్తివంతంగా కనబడుతుంది. చాక‌లి ఐల‌మ్మ‌గా ఇంద్ర‌జ‌, రాజా రెడ్డిగా బాబీ సింహా, శాంత‌వ్వ‌గా వేదిక‌, తమదైన నటనతో అదరగొట్టేవారు.

నిజాం రాజుగా మ‌క‌రంద్ దేశ్ పాండే, ఖాసీం రజ్వీ క్యారెక్టర్ లో రాజ్‌అర్జున్‌ తమ పాత్రల్లో ఒదిగిపోయాడు. అనసూయ కనిపించేది కొద్దిసేపే పాత్ర అయినా గుర్తిండిపోయేలా నటించింది.అంతేకాదు ప్రతిఒక్కరు అద్భుతంగా నటించారని చెప్పుకోవొచ్చు. 

టెక్నీషియన్స్:

డైరెక్టర్ యాట స‌త్య‌నారాయ‌ణ త‌ను రాసుకున్న క‌థ‌ను య‌థాత‌థంగా తెర‌పైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేసింది విజయం సాధించిందని చెప్పుకోవొచ్చు . ఆయన తెరకెక్కించిన కొన్ని ఎపిసోడ్స్‌ కళ్ళకు కట్టినట్లుగా చాలా బాగా చూపించారు. కాక‌పోతే క‌థాంశం సాగిన తీరు మాత్రం కొంతమందికి నచ్చకపోవొచ్చు.

సంగీతం అందించిన భీమ్స్ సిసిరోలియో తనదైన బ్యాక్ గ్రౌండ్  బీజీఎంతో అదరగొట్టేశాడు. కథాంశానికి తగ్గట్టు వచ్చిన పాటలు అద్భుతంగా ఉన్నాయి. బతుకమ్మ పాటతో పాటు చివర్లో వచ్చే జోహార్లు సాంగ్స్‌ ప్రతి ఒక్కరికి గూస్బంప్స్ వచ్చేలా చేసింది. కుశేందర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. తమ్మిరాజు ఎడిటింగ్‌కు చక్కగా కుదిరింది. . గూడూరు నారాయణ రెడ్డి నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.