
- తగ్గనున్న వడ్డీల భారం
- రెపోరేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గింపు
- జీడీపీ వృద్ధి అంచనాల్లోనూ కోత.. ట్రంప్ టారిఫ్లే కారణం
- ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉందని వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ఫోకస్ పెట్టిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ ఏడాది రెండోసారి వడ్డీ రేట్లను తగ్గించింది. ట్రంప్ సుంకాల మోత కొనసాగుతున్న వేళ ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇచ్చేందుకే మొగ్గు చూపింది. ఫలితంగా రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) తగ్గి 6 శాతానికి దిగొచ్చింది. దీంతో బ్యాంకులు ఇచ్చే లోన్లపై వడ్డీ తగ్గుతుంది. వ్యవస్థలో రుణాలు తీసుకోవడం పెరిగి, ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుందని అంచనా. “టారిఫ్ వార్ కారణంగా గ్లోబల్ ఎకానమీ ఔట్లుక్ వేగంగా మారుతోంది” అని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. ట్రేడ్వార్తో ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి నెలకొందని అన్నారు. గ్లోబల్ ఎకానమీ వృద్ధి నెమ్మదించొచ్చని, ఇన్ఫ్లేషన్ పెరగొచ్చని అంచనావేశారు. -
ఆర్బీఐ ఎంపీసీ తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు
1) రెపో రేటు కోత
ఆర్బీఐ రెపో రేటుకు 25 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. దీంతో గతంలో 6.25 శాతంగా ఉన్న వడ్డీ రేటు 6 శాతానికి దిగొచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎంపీసీ మీటింగ్లో కూడా రెపో రేటును 6.5 శాతం నుంచి 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది.
2) జీడీపీ అంచనా తగ్గింపు
ఆర్బీఐ 2025–-26 ఆర్థిక సంవత్సరానికి రియల్ జీడీపీ గ్రోత్ అంచనాను 6.5 శాతానికి తగ్గించింది. గతంలో ఈ నెంబర్ 6.7 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని జూన్ క్వార్టర్లో జీడీపీ 6.5 శాతం, సెప్టెంబర్ క్వార్టర్లో 6.7 శాతం, డిసెంబర్ క్వార్టర్లో 6.6 శాతం, మార్చి క్వార్టర్లో 6.3 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి మీటింగ్లో జూన్ క్వార్టర్లో 6.7 శాతం, సెప్టెంబర్ క్వార్టర్లో 7 శాతం, డిసెంబర్ క్వార్టర్లో 6.5 శాతం, మార్చి క్వార్టర్లో 6.5 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది.
3) తగ్గనున్న ఇన్ఫ్లేషన్
ఇండియాలో ఇన్ఫ్లేషన్ దిగొస్తుందని ఆర్బీఐ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫ్లేషన్ 4 శాతంగా నమోదవుతుందని పేర్కొంది. 4.2 శాతం ఉంటుందని గతంలో వేసిన అంచనాను సవరించింది. జూన్ క్వార్టర్లో 3.6 శాతంగా, సెప్టెంబర్ క్వార్టర్లో 3.9 శాతంగా, డిసెంబర్ క్వార్టర్లో 3.8 శాతంగా, మార్చి క్వార్టర్లో 4.4 శాతంగా నమోదవుతుందని పేర్కొంది
4) కొత్త సంకేతాలు..
ఆర్బీఐ తన వైఖరిని ‘నూట్రల్’ నుంచి ‘అకామిడేటివ్’ కి మార్చింది. అంటే వడ్డీ రేట్లను మరింత తగ్గిచండం లేదా ఇప్పుడున్న పరిస్థితులను కొనసాగించడంపై ఫోకస్ పెట్టనుంది. రేట్లను పెంచే ఆలోచన లేదు. “ ఎటువంటి షాక్లు లేకపోతే వడ్డీ రేట్లను యథాతథ స్థితిలో ఉంచడం లేదా తగ్గించడంపై ఆర్బీఐ ఎంపీసీ దృష్టి సారిస్తుంది” అని మల్హోత్రా పేర్కొన్నారు.
5) యూపీఐ ట్రాన్సాక్షన్ల లిమిట్ పెంచే అవకాశం
యూపీఐ ద్వారా వ్యక్తి నుంచి వ్యాపారికి జరిపే చెల్లింపుల (పీ2ఎం) లావాదేవీ పరిమితులను పెంచడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కి ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఒక రోజులో యూపీఐ ద్వారా వ్యక్తి నుంచి వ్యక్తి (పీ2పీ) కి, వ్యక్తి నుంచి వ్యాపారికి (పీ2ఎం) రూ. 1 లక్ష వరకు మాత్రమే పంపుకోవడానికి వీలుంది. పీ2ఎం చెల్లింపుల్లో అయితే కొన్ని సందర్భాల్లో రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు పంపుకునేందుకు వీలుంది.
6) ఫారెక్స్ రిజర్వ్లు 676.3 బిలియన్ డాలర్లు
ఇండియా ఫారెక్స్ రిజర్వ్లు ఈ నెల 4 నాటికి 676.3 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యాయి. దాదాపు 11 నెలల దిగుమతులను వీటితో కవర్ చేయొచ్చు. ట్రంప్ టారిఫ్ వార్ మొదలు పెట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో, ఇండియా ఫారెక్స్ నిల్వలు నిలకడగా ఉండడం ఉపశమనం కలిగించే విషయమని ఎకనమిస్టులు చెబుతున్నారు.
ఇండ్ల అమ్మకాలు పెరుగుతాయ్
ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం వలన ఇండ్ల అమ్మకాలు ఊపందుకుంటాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. గృహ రుణాలపై వడ్డీ రేట్లను బ్యాంకులు తగ్గిస్తాయని, ఫలితంగా ఇండ్ల అమ్మకాలు పెరుగుతాయని చెబుతున్నాయి. ముఖ్యంగా రూ. కోటి కంటే తక్కువ ధర ఉన్న ఇండ్ల అమ్మకాలు ఊపందు కుంటాయని ఆశిస్తున్నాయి. రియల్టీ సంస్థలు క్రెడాయ్, నరెడ్కో రేట్ల తగ్గింపు నిర్ణయాన్ని స్వాగతించాయి. రియల్టీ కన్సల్టెన్సీ కంపెనీల డేటా ప్రకారం, ఈ ఏడాది మార్చి క్వార్టర్లో ఇండ్ల అమ్మకాలు ఏడాది లెక్కన 28 శాతం పడ్డాయి.