
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిగ్రీ అర్హతతో 950 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో సాధించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మూడేళ్ల అనుభవంతో గ్రేడ్ ఏ, గ్రేడ్ బీ ఆఫీసర్ లెవెల్ హోదా అందుకోవచ్చు. నోటిఫికేషన్ వివరాలు, సెలెక్షన్ ప్రాసెస్, ప్రిపరేషన్ ప్లాన్, ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం..
నోటిఫికేషన్ వివరాలు
ఖాళీలు: 950
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.
వయసు: 1 ఫిబ్రవరి 2022 నాటికి 20 -నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 8 మార్చి
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మన్కు రూ.50. మిగిలిన అభ్యర్థులకు రూ.450.
పరీక్ష తేదీలు: ప్రిలిమ్స్ మార్చి 26, 27 తేదీల్లో ఉంటుంది. మెయిన్స్ మే నెలలో నిర్వహించనున్నారు. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి.
వెబ్సైట్: www.rbi.org.in
బ్యాంకుల లావాదేవీలను పరిశీలించడం అసిస్టెంట్ ప్రధాన విధి. వారానికి ఐదు రోజుల పని, తక్కువ పని వేళలు, ఒత్తిడి లేని విధులు- ఈ పోస్టుల ప్రత్యేకత. తాజాగా ప్రకటించిన అసిస్టెంట్ పోస్టుకు ఎంపికైతే.. రూ.20,700 బేసిక్ సాలరీ అందుతుంది. దీనికి అదనంగా డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర ప్రోత్సాహకాలూ దక్కుతాయి. అందువల్ల మొదటి నెల నుంచే అన్నీ కలిపి రూ.45 వేల వేతనం పొందవచ్చు.
సెలెక్షన్ ప్రాసెస్
అభ్యర్థులకు ముందుగా ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి మెయిన్స్ ఉంటుంది. అనంతరం అర్హత పరీక్షగా లాంగ్వేజ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది.
ప్రిలిమ్స్: 100 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ప్రశ్నలు వస్తాయి. వీటిని 3 విభాగాల నుంచి అడుగుతారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 30, న్యూమరికల్ ఎబిలిటీ- 35, రీజనింగ్ ఎబిలిటీ- 35 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో విభాగానికి 20 నిమిషాల చొప్పున పరీక్షకు గంట సమయాన్ని కేటాయించారు.
మెయిన్స్: ఈ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ల్లో ప్రశ్నలు అడుగుతారు. జనరల్ అవేర్నెస్ విభాగానికి 25 నిమిషాలు, కంప్యూటర్ నాలెడ్జ్కు 20 నిమిషాలు ఉన్నాయి. మిగిలిన ఒక్కో విభాగాన్నీ 30 నిమిషాల్లో పూర్తిచేయాలి. ఎగ్జామ్ పేపర్ ఇంగ్లిష్, హిందీ మీడియంలో ఉంటుంది.
లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్: మెయిన్స్లో అర్హత సాధించినవారికి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (ఎల్పీటీ) నిర్వహిస్తారు. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న కార్యాలయానికి కేటాయించిన భాషలో ఈ పరీక్ష రాయాలి. హైదరాబాద్లోని 40 ఖాళీలకు మాత్రమే తెలుగు భాష పరీక్ష రాసే అవకాశం ఉంది.
ప్రిపరేషన్ ప్లాన్
ఇప్పటికే బ్యాంకు పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఆర్బీఐ కోసం ప్రత్యేకంగా చదవనవసరం లేదు. ఇంగ్లిష్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ- ఈ మూడు అంశాలూ ప్రాథమిక, ప్రధాన పరీక్షలు- రెండింటిలోనూ ఉన్నందున కంబైన్డ్ ప్రిపరేషన్ చేయాలి. మాక్ టెస్టులు ఎక్కువగా రాస్తే టైమ్ సేవ్ అవుతుంది. జనరల్ మ్యాథ్స్, ఇంగ్లిష్లో గ్రామర్, బేసిక్స్ నేర్చుకోవాలి. మెయిన్స్లో ఎక్కువ మార్కులు సాధించడానికి జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్స్ బేసిక్స్పై ఫోకస్ చేయాలి.
:: వెలుగు, ఎడ్యుకేషన్ డెస్క్