
- ఆర్సీబీకి రెండో విజయం
- రాణించిన బౌలర్లు, డానీ వ్యాట్
- 8 వికెట్ల తేడాతో ఢిల్లీ చిత్తు
వడోదర: తొలి మ్యాచ్లో భారీ టార్గెట్ను ఛేజ్ చేస్తూ విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)ను ఆరంభించిన డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరో ఘన విజయం ఖాతాలో వేసుకుంది. బౌలర్ల సమష్టి కృషికి తోడు బ్యాటింగ్లో కెప్టెన్ స్మృతి మంధాన (47 బాల్స్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 81)విజృంభించడంతో సోమవారం జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. ఏకపక్ష మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన ఢిల్లీ 19.3 ఓవర్లలో 141 రన్స్కు ఆలౌటైంది.
గత మ్యాచ్లో సత్తా చాటిన ఓపెనర్ షెఫాలీ వర్మ (0) ఈసారి డకౌటవ్వగా.. కెప్టెన్ మెగ్ లానింగ్ (17) ఆకట్టుకోలేకపోయింది. జెమీమా రోడ్రిగ్స్(34), సారా బ్రైస్ (23) సత్తా చాటారు. అనాబెల్ సదర్లాండ్ (19) శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆర్సీబీ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో మరిజేన్ కాప్ (12), జెస్ జొనాసెన్ (1), రాధా యాదవ్ (0), అరుంధతి (4) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. బెంగళూరు బౌలర్లలో రేణుకా సింగ్, జార్జియా వారెహమ్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. కిమ్ గార్త్, ఏక్తా బిష్త్ రెండేసి వికెట్లు తీశారు.
అనంతరం కెప్టెన్ మంధానతో పాటు మరో ఓపెనర్డాని వ్యాట్ (33 బాల్స్లో 7 ఫోర్లతో 42) సత్తాచాటడంతో ఆర్సీబీ 16.2 ఓవర్లలోనే 146/2 స్కోరు చేసి గెలిచింది. స్టార్టింగ్ నుంచే దూకుడుగా ఆడిన మంధాన, వ్యాట్ తొలి వికెట్కు 107 రన్స్ జోడించారు. 11వ ఓవర్లో వ్యాట్, గెలుపు ముంగిట మంధాన ఔటైనా ఎలైస్ పెర్రీ (7 నాటౌట్), రిచా ఘోష్ (11 నాటౌట్) లాంఛనం పూర్తి చేశారు. రేణుకకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.