ఢిల్లీపై రివేంజ్ తీర్చుకున్న RCB.. 6 వికెట్ల తేడాతో గెలుపు

ఢిల్లీపై రివేంజ్ తీర్చుకున్న RCB.. 6 వికెట్ల తేడాతో గెలుపు

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌–18లో రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు ‘టాప్‌‌’ లేపింది. ఛేజింగ్‌‌లో క్రునాల్‌‌ పాండ్యా (47 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 4 సిక్స్‌‌లతో 73 నాటౌట్‌‌), కోహ్లీ (47 బాల్స్‌‌లో 4 ఫోర్లతో 51) రాణించడంతో.. ఆదివారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలిచింది. టాస్‌‌ ఓడిన ఢిల్లీ 20 ఓవర్లలో 162/8 స్కోరు చేసింది. కేఎల్‌‌ రాహుల్‌‌ (41) టాప్‌‌ స్కోరర్‌‌. ఆరంభం నుంచే బెంగళూరు పేసర్లు భువనేశ్వర్‌‌ (3/33), హాజిల్‌‌వుడ్‌‌ (2/36) లైన్‌‌ అండ్ లెంగ్త్‌‌కు కట్టుబడటంతో డీసీ రన్స్‌‌ చేయడంలో ఇబ్బందిపడింది. 

ఓపెనర్లు అభిషేక్‌‌ పోరెల్‌‌ (28), డుప్లెసిస్‌‌ (22) మెరుగ్గా ఆడే ప్రయత్నం చేశారు. కానీ ఆరు బాల్స్‌‌ తేడాలో పోరెల్‌‌తో పాటు కరుణ్‌‌ నాయర్‌‌ (4) ఔట్ కావడంతో పవర్‌‌ప్లేలో డీసీ 52/2 స్కోరు చేసింది. పోరెల్‌‌తో తొలి వికెట్‌‌కు 33 రన్స్‌‌ జోడించిన డుప్లెసిస్‌‌కు రాహుల్‌‌ అండగా నిలిచాడు. భారీ షాట్లకు పోకుండా ఈ ఇద్దరు స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేస్తూ ఇన్నింగ్స్‌‌ను గాడిలో పెట్టారు. అయితే10వ ఓవర్‌‌లో క్రునాల్‌‌ పాండ్యా (1/28) టర్నింగ్‌‌ బాల్‌‌కు డుప్లెసిస్‌‌ వెనుదిరిగడంతో మూడో వికెట్‌‌కు 28 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. ఢిల్లీ 72/3తో కష్టాల్లో పడింది. 

ఇక్కడి నుంచి రాహుల్‌‌ ఒంటరిపోరాటం చేశాడు. అక్షర్‌‌ పటేల్ (15) ధనాధన్‌‌ షాట్లకు వెళ్లి నాలుగో వికెట్‌‌కు 30 రన్స్‌‌ జత చేసి వెనుదిరిగాడు. 102/4 వద్ద క్రీజులోకి వచ్చిన స్టబ్స్‌‌ (34) మెరుపు ఇన్నింగ్స్‌‌ ఆడాడు. 17వ ఓవర్‌‌లో భువీ నాలుగు బాల్స్‌‌ తేడాలో రాహుల్‌‌, అశుతోష్‌‌ శర్మ (2)ను ఔట్‌‌ చేశాడు. అయితే విప్రజ్‌‌ నిగమ్‌‌ (12)తో కలిసి స్టబ్స్‌‌ ఏడో వికెట్‌‌కు 15 బాల్స్‌‌లోనే 38 రన్స్‌‌ రాబట్టడంతో డీసీ మంచి స్కోరే సాధించింది. 

తర్వాత బెంగళూరు 18.3 ఓవర్లలో 165/4 స్కోరు చేసి నెగ్గింది. 26 రన్స్‌‌కే జాకబ్‌‌ బీథెల్‌‌ (12), దేవదత్‌‌ పడిక్కల్‌‌ (0), రజత్‌‌ పటీదార్‌‌ (6)  ఔటైనా.. కోహ్లీ, క్రునాల్‌‌ అద్భుతంగా ఆడారు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌‌కు 119 రన్స్‌‌ జోడించి విజయానికి బాటలు వేశారు. చివర్లో కోహ్లీ వెనుదిరిగినా, టిమ్‌‌ డేవిడ్‌‌ (19 నాటౌట్‌‌) దంచికొట్టాడు. అక్షర్‌‌ పటేల్‌‌ 2 వికెట్లు తీశాడు. క్రునాల్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

సంక్షిప్త స్కోర్లు
ఢిల్లీ: 20 ఓవర్లలో 162/8 (రాహుల్‌‌ 41, స్టబ్స్‌‌ 34, భువనేశ్వర్‌‌ 3/33). 
బెంగళూరు: 18.3 ఓవర్లలో 165/4 (క్రునాల్‌‌ 73*, కోహ్లీ 51, అక్షర్‌‌ పటేల్‌‌ 2/19)