
హుస్నాబాద్, వెలుగు : 85 ఏండ్లు దాటిన వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచే ఓటు వేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, హుస్నాబాద్ ఆర్డీవో రాంమ్మూర్తి తెలిపారు. మంగళవారం తన ఆఫీసులో సిబ్బందితో సమీక్ష జరిపారు. ఎంపీ ఎన్నికల ప్రక్రియ సాఫీగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంటి నుంచే ఓటు వేసే వీలు కల్పిస్తున్నట్టు తెలిపారు.
తుది ఓటర్ల జాబితా ప్రకారం హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో 85 ఏండ్లు దాటినవారు 77 మంది ఉన్నారని, అంగవైకల్యం ఉన్నవారు 185 మంది ఉన్నారని తెలిపారు. వీరి వద్దకు వెళ్లి ఓటు కలెక్ట్ చేసేందుకు ఎనిమిది టీంలను ఏర్పాటుచేసినట్టు ఆర్డీవో తెలిపారు. ప్రతి టీంకు నలుగురి చొప్పున, ఎనిమిది మంది పోలింగు అధికారులుంటారన్నారు. వారికి అసిస్టెంట్ పోలింగు అధికారులు మరో ఎనిమిది మందితోపాటు ఇంకో ఎనిమిది మంది మైక్రో అబ్జర్వర్లను అపాయింట్ చేసినట్టు చెప్పారు. వారందరికీ వృద్ధులు, వికలాంగుల ఇండ్లకు వెళ్లి ఎలా ఓట్లు వేయించి తీసుకురావాలనే దానిపై ట్రైనింగ్ కూడా ఇచ్చామన్నారు.