
గద్వాల, వెలుగు: పంటలు ఎండుతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొంటూ ఆర్డీఎస్ రైతులు సోమవారం కలెక్టరేట్ ను ముట్టడించారు. కలెక్టరేట్ ముందు బైఠాయించి పంటలను కాపాడాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఆర్డీఎస్ కింద 16 గ్రామాల రైతులకు సంబంధించిన 20 వేల ఎకరాలు ఎండిపోతున్నాయని వాపోయారు. తుంగభద్ర నదిలో 16 టీఎంసీల నీరు ఉందని, అందులో రెండు టీఎంసీలు వదిలినా పంటలు కాపాడుకోవచ్చన్నారు.
ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. పంట పొలాలకు నీళ్లు ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందించారు. రైతుల ధర్నాకు బీఆర్ఎస్ నాయకులు నాగర్ దొడ్డి వెంకటరాములు, పల్లయ్య సంఘీభావం తెలిపారు.