
- తాంశ వద్ద చెక్డ్యామ్ ఎత్తు కారణంగా నీట మునుగుతున్న నిర్మల్లోని కాలనీలు
- చెక్డ్యామ్ ఎత్తు మీటర్ మేర తొలగించాలని సర్కార్ ఆర్డర్స్
నిర్మల్, వెలుగు : నిర్మల్ పట్టణంలోని పలు ప్రాంతాలను ముంచెత్తుతున్న స్వర్ణ వాగు వరద ఉధృతిని తగ్గించేందుకు ఇరిగేషన్ శాఖ ఆఫీసర్లు రూపొందించిన ప్రపోజల్కు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్వర్ణ వాగు మధ్యలో తాంశ గ్రామం వద్ద నిర్మించిన చెక్డ్యామ్ ఎత్తు తగ్గింపునకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఆర్డర్స్ జారీ చేసింది. తాంశ గ్రామం వద్ద మూడు మీటర్ల ఎత్తుతో కొన్ని నెలల కింద చెక్ డ్యామ్ నిర్మించారు. ఈ చెక్డ్యామ్ ఎత్తు కారణంగా వరద ప్రవాహానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నీరంతా లోతట్టు ప్రాంతాల్లోకి చేరుతుండడంతో మంజులాపూర్తో పాటు ఆదర్శనగర్
జీఎన్ఆర్ కాలనీ, సిద్దాపూర్ తదితర ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. సమస్యను పరిష్కరించాలని ప్రజలు, ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ప్రత్యామ్నాయ చర్యలపై ప్రపోజల్స్ రెడీ చేయాలని ప్రభుత్వం ఇరిగేషన్ ఆఫీసర్లను ఆదేశించింది. తాంశ చెక్డ్యామ్ ఎత్తును ఓ మీటర్ తగ్గిస్తే ముంపు సమస్యను పరిష్కరించవచ్చని ఆఫీసర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఆర్డర్స్ జారీ చేసింది.