మెరుగైన సర్కార్ ​వైద్యం

 మెరుగైన సర్కార్ ​వైద్యం
  • పీహెచ్​సీల్లో ఉంటున్న డాక్టర్లు
  • జీపీఎస్ లొకేషన్ అటెండెన్స్ తో మార్పు
  • దవాఖానలకు పెరిగిన రోగుల రాక

సిద్దిపేట, వెలుగు: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ప్రారంభించిన సంస్కరణలు చక్కటి  ఫలితాలనిస్తున్నాయి. పేదలకు వైద్య సేవలందించే సర్కారు దవాఖానలకు రోగుల రాకపెరిగింది. గతంలో సర్కారు దవాఖానల్లో డాక్టర్లు అందుబాటులో ఉండరనే మాటలు తరచుగా వినిపించేవి. ఇటీవల కొన్ని మార్పుల వల్ల పీహెచ్​సీలలో సైతం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు డాక్టర్లు అక్కడే ఉండి వైద్యసేవలందిస్తున్నారు. దీంతో జిల్లాలో 35 పీహెచ్​సీలు, 2 యూపీఎస్ లు, బస్తీ దవాఖానలకు రోగుల రాక పెరగడమే కాకుండా గత నెలలో 15 వరకు డెలీవరీలు జరిగాయి.  రెండు నెలలుగా పీహెచ్​సీలకు ప్రతి రోజు 80 మంది కి పైగా రోగులు వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు. 

సర్కార్​దవాఖానల్లో  మెడికల్ ఆఫీసర్లు  అందుబాటులో ఉండడం లేదని, రిజిస్టర్లలో అటెండెన్స్ వేసుకుని వెళ్లిపొతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కొన్ని మార్పులను ప్రారంభించింది.  పీహెచ్​సీలు, సబ్ సెంటర్లు, హెల్త్ సెంటర్లలో పనిచేసే మెడికల్ ఆఫీసర్లు ఉదయం డ్యూటీకి వచ్చినప్పుడు, సాయంత్రం వెళ్లేటప్పుడు జీపీఎస్ లోకేషన్ తో ఫొటో అటెండెన్స్ ను డిస్ట్రిక్ మెడికల్ ఆఫీసర్ వాట్సాప్ గ్రూప్ లో అప్​లోడ్​ చేయాలి. దీనిని డీఎంహెచ్​వో ప్రతి రోజు పరిశీలిస్తుండడం మార్పునకు కారణమైంది. దవాఖానల్లో మెడికల్ ఆఫీసర్లు అందుబాటులో ఉండడంతో డెలీవరీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నిర్ణయం వల్ల  సర్కార్​దవాఖానలకు రెండు నెలల్లో  30  శాతం వరకు  రోగుల సంఖ్య పెరిగింది. 

ఎన్​క్వాస్​ సర్టిఫికేషన్ కోసం ప్రయత్నాలు

జిల్లాలోని 20 పీహెచ్​సీల అధికారులు ఈ ఏడాది  కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్​క్వాస్​(నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్​ స్టాండర్ట్ ) సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశారు. ఈ సర్టిఫికెట్ లభిస్తే వచ్చే మూడేండ్ల పాటు కేంద్ర ప్రభుత్వం అదనంగా నిధులు మంజూరు చేస్తుంది. వీటిలో గుర్రాల గొందీ పీహెచ్​సీ ని ఇటీవల కేంద్ర బృందం పరిశీలించింది. ఎన్​క్వాస్​సర్టిఫికేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలను విధించింది. ఆయా దవాఖానాల్లో 13 రకాల రిజిస్టర్లు ఏర్పాటు చేసి ఓపీ, మెటర్నరీ, ఇమ్యూనైజేషన్, టీబీ, లెప్రసీ వంటి రోగుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు
 చేయాల్సి ఉంటుంది.

సర్కారు దవాఖానలో సేవలు బాగున్నాయ్​

సర్కారు దవాఖానలో  వైద్య సేవలు మంచిగున్నయ్. దవాఖానకు ఎప్పుడొచ్చినా డాక్టర్ ఉంటున్నడు. నా అనారోగ్య సమస్యలు చెప్పి మందులు తీసుకుంటున్నా. ఈ మధ్య కాలంలో చాలామంది దవాఖానకు వస్తుండ్రు. కుక్క, కోతి కరిస్తే టీకాలు అందుబాటులో ఉంచాలి. ‌‌ - గొల్ల బాలయ్య , కాన్గల్ 

మెరుగైన వైద్యం కోసం చర్యలు

జిల్లాలోని సర్కార్​ దవాఖానల్లో మెరుగైన  వైద్యం అందించి ఆర్థికభారాన్ని దూరం చేయాలనే  దిశగా చర్యలు చేపట్టాం. ఇందులో భాగంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మెడికల్ ఆఫీసర్లు దవాఖానల్లో ఉండే విధంగా నిబంధనలు రూపొందించాం. స్థానిక దవాఖానాలను పటిష్టం చేస్తే పేదలకు ఎక్కువగా లబ్ధి చేకూరుతుంది. పీహెచ్​సీలలో డెలీవరీలు పెంచే దిశగా చర్యలు చేపపడుతున్నాం. జిల్లాలోని 20 పీహెచ్​సీలకు ఎన్​క్వాస్​సర్టిఫికెట్ లభించేలా చర్యలు తీసుకుంటున్నాం.- డాక్టర్ పల్వన్ కుమార్, డీఎంహెచ్​వో