రిజిస్ట్రేషన్ ఆఫీసులో బంధువుల కొట్లాట

రిజిస్ట్రేషన్ ఆఫీసులో బంధువుల కొట్లాట

దహెగాం, వెలుగు : భూమి అమ్మి రిజిస్ట్రేషన్  కోసం స్లాట్ బుక్  చేసుకున్న తమ బంధువులపై వారి మేనలుళ్లు తహసీల్దార్  ఆఫీసులోనే దాడి చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్  జిల్లాలోని దహెగాంలో ఈ ఘటన జరిగింది. సిర్పూర్​(టి) మండలానికి చెందిన ఫైమదా బేగం, సాజిదా బేగం అక్కాచెల్లెళ్లు. దహెగాం మండలం లగ్గాం శివారులోని సర్వే నంబర్​102/ఈ/ఎ/2లో వారికి 4 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని వారు అమ్మేసి రిజిష్ట్రేషన్​ కోసం గురువారం స్లాట్​ బుక్  చేసుకున్నారు. 

అయితే, వీలునామా ప్రకారం ఆ భూమి తమకు వచ్చిందని, కోర్టులో కేసు వేశామని సదరు మహిళల మేనల్లుళ్లు, బెజ్జూర్  మండలం కాటేపల్లికి చెందిన మస్నత్​అలీ ఖాన్, జీషాద్ అలీ ఖాన్, అమీర్అలీ ఖాన్, అర్బాజ్​అలీ ఖాన్ తహసీల్దార్​ ఆఫీస్​కు చేరుకొని రిజిస్ట్రేషన్​ను అడ్డుకున్నారు. కోర్టు ఆర్డర్​ కాపీ చూపాలని, లేదంటే రిజిస్ట్రేషన్​ ఆపడం కుదరదని తహసీల్దార్​కవిత వారికి స్పష్టం చేశారు. 

ఈ పంచాయితీ నడుస్తుండగా.. బయటకు వెళ్లి వచ్చిన సదరు మహిళల మేనలుళ్లు తమ అత్తలతోపాటు వారి బంధువులపై కారం చల్లి దాడి చేశారు. అక్కడే ఉన్న ఎస్సై సనత్ ​కుమార్​ వారిని అడ్డుకొని పోలీస్​స్టేషన్​కు తరలించారు. దీంతో ఎట్టకేలకు రిజిష్ట్రేషన్​పూర్తయింది. ఫైమదా బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ నలుగురిపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.