
న్యూఢిల్లీ: మనదేశంలో 2024 డిసెంబర్ నాటికి మొత్తం టెలిఫోన్ యూజర్ల బేస్ కొంచెం పెరిగి 118.92 కోట్లకు చేరుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రకారం నవంబర్లో మొత్తం టెలిఫోన్ యూజర్ల సంఖ్య 118.75 కోట్లు కాగా, 47.65 కోట్ల మంది బ్రాడ్బ్యాండ్ యూజర్లతో రిలయన్స్ జియో ముందంజలో ఉంది. తరువాతిస్థానాల్లో ఎయిర్టెల్ (28.93 కోట్లు), వొడాఫోన్ ఐడియా (12.68 కోట్లు) ఉన్నాయి. గత నవంబర్లో 65.97 కోట్లుగా ఉన్న పట్టణ టెలిఫోన్ సబ్స్క్రిప్షన్లు డిసెంబర్లో 66.37 కోట్లకు పెరిగాయి.
గ్రామీణ సబ్స్క్రిప్షన్లు 52.72 కోట్ల నుంచి 52.65 కోట్లకు తగ్గాయి. వైర్లెస్ యూజర్ల సంఖ్య నవంబర్ 2024లో 114.85 కోట్ల నుంచి డిసెంబర్ 2024లో 115.66 కోట్లకు పెరిగింది. రిలయన్స్ జియో 3,906,123 మంది వైర్లెస్ యూజర్లను, ఎయిర్టెల్ 1,033,009 మంది సబ్స్క్రయిబర్లను సంపాదించింది. వోడాఫోన్ ఐడియా 1,715,975 మంది వైర్లెస్ సబ్స్క్రయిబర్లను కోల్పోయింది. డిసెంబర్ 2024 చివరి నాటికి రిలయన్స్ జియో 50.43 శాతం మార్కెట్ వాటాతో నంబర్వన్ పొజిషన్లో ఉంది.