
హైదరాబాద్, వెలుగు: సుమారు 50 వేల మంది ఇంటర్ స్టూడెంట్లకు హైకోర్టులో ఊరట లభించింది. గుర్తింపు లేని 217 కాలేజీల్లో అడ్మిషన్లు పొందిన వీరి నుంచి పెనాల్టీ లేకుండా పరీక్ష ఫీజును వసూలు చేయాలని చెప్పింది. ఈ మేరకు ఇంటర్ బోర్డును ఆదేశించింది. అలాగే, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్వోసీ సమర్పించకపోవడంతో విధించిన రూ.లక్ష జరిమానాను కాలేజీ లు శనివారంలోగా చెల్లించాలని చెప్పింది.
ఇంటర్ బోర్డు విధించిన రూ.లక్ష జరిమానా మొత్తాన్ని మినహాయిం పు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ టి.వినోద్కుమార్ శుక్రవారం విచారించారు.
పెనాల్టీ చెల్లించాల్సిన ఒక్కో విద్యార్థికి రూ.2500 చొప్పున లెక్కించి ఆ మొత్తానికి ఈ నెల 28లోగా బ్యాంకు గ్యారంటీ సమర్పించాలని కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి ప్రక్రియను కొనసాగించి, మార్చిలో జరిగే పరీక్షలకు విద్యార్థులను అనుమతించాలని చెప్పింది.