Paris Olympics 2024: భారత రెజ్లర్‌పై మూడేళ్ల నిషేధం.. ఒలంపిక్స్‌లో ఏం జరుగుతోంది?

Paris Olympics 2024: భారత రెజ్లర్‌పై మూడేళ్ల నిషేధం.. ఒలంపిక్స్‌లో  ఏం జరుగుతోంది?

పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్లకు ఏదీ కలిసిరావడం లేదు. 100 గ్రాముల అధిక బరువు ఉందన్న కారణంగా స్టార్ రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్‌‌పై అనర్హత వేటు పడగా.. తాజాగా మరో భారత రెజ్లర్‌ అంతిమ్‌ పంగల్‌‌ను నిర్వాహకులు బయటకి పంపించేశారు. అంతిమ్‌ అక్రిడిటేషన్‌ కార్డు దుర్వినియోగం అవ్వడమే అందుకు కారణం. భారత రెజ్లర్‌ అక్రిడిటేషన్‌ కార్డుతో ఆమె సోదరి ఒలింపిక్ విలేజ్‌లోకి ప్రవేశించింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న భారత ఒలింపిక్స్‌ కమిటీ(IOA) ఆమెపై మూడేళ్ల నిషేధం విధించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

అసలేం జరిగింది..?

ఒలింపిక్స్‌లో అంతిమ్‌ పంగల్‌ 53 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో పోటీ పడింది. క్వార్టర్స్‌లో టర్కీ రెజ్లర్‌ యెట్‌గిల్ జైనెప్‌పై 0-10 తేడాతో ఓడిపోయింది. ఆ నిరాశలో ఉన్న ఆమె ఒలింపిక్ విలేజ్ బయట హోటల్‌లో ఉంటున్న తన కోచ్‌లను కలిసేందుకు వెళ్ళింది. అయితే, తన వస్తువులు కొన్ని ఒలింపిక్ విలేజ్‌లోనే ఉండటంతో వాటిని తీసుకురావాలని తన సోదరి(నిశా)కి చెప్పింది. లోపలికి అనుమతించాలంటే అక్రిడిటేషన్‌ కార్డు తప్పనిసరి కనుక దానిని తన సోదరికి ఇచ్చింది. నిశా విలేజ్‌లోకి వెళ్లి వస్తువులను తీసుకొస్తుండగా.. సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అడ్డుకొన్నారు. ఎవరు..? ఏంటి..? ఎక్కడికి వెళ్తున్నారు..? అని ఆరా తీయడంతో జరిగిన విషయం మొత్తం ఆమె బయట పెట్టింది. 

నిబంధనల ప్రకారం, ఒక అథ్లెట్‌ అక్రిడిటేషన్‌ కార్టు మరొకరికి ఇవ్వడం ఉల్లంఘన కిందకు వస్తుంది. దాంతో, భారత రెజ్లర్ తన అక్రిడిటేషన్‌ కార్డును దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలపై ఒలింపిక్స్‌ నిర్వాహకులు ఆమెపై చర్యలు తీసుకున్నారు. అక్రిడిటేషన్‌ కార్డు రద్దు చేశారు.

మూడేళ్ల నిషేధం

అంతిమ్‌ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న భారత ఒలింపిక్స్‌ కమిటీ(IOA) ఆమెపై మూడేళ్ల నిషేధం విధించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. పారిస్ ఒలింపిక్స్‌లో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకుగానూ IOA ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 

కాగా, మరోవైపు అంతిమ్ కోచ్‌లు భగత్‌సింగ్‌, వికాస్‌లు స్థానిక క్యాబ్‌ డ్రైవర్‌తో గొడవ పడ్డారని కథనాలు వస్తున్నాయి. మద్యం మత్తులో ప్రయాణించిన వీరు, క్యాబ్‌ డ్రైవర్‌కు ఛార్జీలు చెల్లించడానికి నిరాకరించారని సమాచారం. దీనిపై సదరు డ్రైవర్ పోలీసులకు ఫోన్ చేశారని నివేదికలు పేర్కొన్నాయి.