ఒకేసారి లక్ష మంది వీక్షించేలా.. మహా నగరంలో కొత్త క్రికెట్ స్టేడియం

ఒకేసారి లక్ష మంది వీక్షించేలా.. మహా నగరంలో కొత్త క్రికెట్ స్టేడియం

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కొత్త క్రికెట్ స్టేడియం రూపుదిద్దుకోనుంది. వాంఖడే స్టేడియానికి 68 కి.మీ దూరంలో దీనిని నిర్మించనున్నారు. థానే నగరానికి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమనే గ్రామంలో 50 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో, ఒకేసారి లక్ష మంది కూర్చొని వీక్షించేలా స్టేడియాన్ని నిర్మించనున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.

స్టేడియం నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించేందుకు మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఎస్‌ఆర్‌డిసి) ఇప్పటికే ప్రణాళికలు మొదలు పెట్టింది. ఓపెన్ టెండర్లను ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టు కొరకు మహారాష్ట ప్రభుత్వ అనుమతి కోసం నగర క్రికెట్ పాలక మండలి ఎదురుచూస్తోంది. ఇటీవల మరణించిన ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమోల్ కాలే కలల ప్రాజెక్ట్ ఈ స్టేడియం నిర్మాణం అన్న మాటలు వినపడుతున్నాయి. 

ఆర్థిక రాజధాని ముంబైలో ఇప్పటికే వాంఖడే స్టేడియం కాకుండా.. మరో రెండు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి. వాంఖడే స్టేడియం సామర్థ్యం 33వేలు కాగా, బ్రబౌర్న్ స్టేడియం 20,000 మందికి ఆతిథ్యం ఇవ్వగలదు. ఇక, నావీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియం 45,000 మంది కూర్చొనే సామర్థ్యం కలదు.

విధాన్ భవన్‌లో క్రికెటర్లకు సన్మానం

కాగా, టీ20 ప్రపంచకప్ విజయానంతరం స్వదేశానికి చేరుకున్న భారత జట్టును మహారాష్ట్ర ప్రభుత్వం, ఏక్‌నాథ్ షిండే సర్కార్ రాష్ట్ర అసెంబ్లీకి ఆహ్వానించి.. సన్మానించింది. రూ.11 కోట్ల నగదు బహుమతిని అందించింది. ఈ కార్యాక్రమానికి భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సహా సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్, బౌలింగ్‌ కోచ్‌ పరాస్ మాంబ్రే హాజరయ్యారు. ఈ సన్మాన కార్యక్రమం అనంతరం మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నగరానికి పెద్ద స్టేడియం కావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే స్టేడియం నిర్మాణం జోరందుకుంది.