
అచ్చంపేట/అమ్రాబాద్, వెలుగు : ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో లోపల కూరుకుపోయిన లోకో ట్రైన్ ఇంజిన్, ఇతర భాగాలను రెస్క్యూ సిబ్బంది శుక్రవారం బయటకు తీశారు. ఇన్నాళ్లు రెస్క్యూకు ఆటంకంగా మారిన ట్రైన్ ఇంజిన్, ఇతర విడిభాగాలను తొలగించడంతో సహాయక చర్యలు ముమ్మరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. టన్నెల్లో జరుగుతున్న సహాయక చర్యలపై స్పెషల్ ఆఫీసర్ శివశంకర్ లోతేటి శుక్రవారం రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్ఐ ఆఫీసర్ల సూచన మేరకు ప్రమాద స్థలం నుంచి 30 మీటర్ల వరకు అత్యాధునిక పరికరాల ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. తవ్వకాలకు అడ్డుగా ఉన్న పరికరాలను, నీటి ఊటను ఎప్పటికప్పుడు బయటకు తరలిస్తున్నామన్నారు.
రివ్యూలో నాగర్ కర్నూల్ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఆర్మీ ఆఫీసర్లు వికాస్ సింగ్, విజయ్కుమార్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, కల్వకుర్తి ఆర్డీవో శ్రీనివాసులు, ఎన్డీఆర్ఎఫ్ ఆఫీసర్ కిరణ్కుమార్, ఎస్డీఆర్ఎఫ్ ఆఫీసర్ గిరిధర్రెడ్డి, సౌత్ సెంట్రల్ రైల్వే అధికారి నేతి చంద్ర, జీఎస్ఐ ఆఫీసర్ పంకజ్ తిరుగున్, హైడ్రా ఆఫీసర్లు పాల్గొన్నారు.