కనిపెట్టడం కష్టం.. ట్రీట్మెంటూ లేదు: దేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరికి ప్రాణాంతక డయాబెటిస్​టైప్​ 5

కనిపెట్టడం కష్టం.. ట్రీట్మెంటూ లేదు: దేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరికి ప్రాణాంతక డయాబెటిస్​టైప్​ 5
  • కొత్త డయాబెటిస్​ టైప్​ 5
  • పోషకాహార లోపంతో వస్తున్నట్టు గుర్తింపు
  • కనిపెట్టడం కష్టం.. ట్రీట్మెంటూ లేదు అధికారికంగా ప్రకటించిన ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ 
  • ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల మంది ‘టైప్ 5’ బాధితులు
  • వీరిలో 19 ఏండ్లలోపు వాళ్లే ఎక్కువ
  • మన దేశంలో 8.98 కోట్ల మందికి షుగర్ ఉన్నట్టు నివేదిక  

హైదరాబాద్, వెలుగు: ఇప్పటిదాకా టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ గురించే అందరికీ తెలుసు. కానీ, ఆ జాబితాలోకి ఇప్పుడు కొత్తగా మరో రకం మధుమేహం వచ్చి చేరింది. ‘టైప్​ 5’ డయాబెటిస్​గా దానిని ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (ఐడీఎఫ్) అధికారికంగా గుర్తించింది. మిగతా డయాబెటిస్ రకాలతో పోలిస్తే ఇది కొంచెం వేరుగా ఉంటుందని, ప్రాణాంతకంగా పరిణమించే ముప్పూ ఎక్కువేనని చెబుతున్నారు.

 టైప్1, టైప్​2 డయాబెటిస్​లు ఊబకాయంతో  లేదంటే జన్యు సమస్యలతో వస్తుంటాయి. కానీ, ఈ టైప్ 5 డయాబెటిస్​కు ప్రధాన కారణం పోషకాహారలోపమేనని సైంటిస్టులు వెల్లడించారు. ఎక్కువగా19 ఏండ్లలోపు యువతలోనే ఈ రకం డయాబెటిస్ డెవలప్ అవుతున్నదని పేర్కొంటున్నారు. ఇటీవల థాయిలాండ్​లో నిర్వహించిన డయాబెటిస్ సదస్సులో టైప్ 5 డయాబెటిస్​ను ఐడీఎఫ్ అధికారికంగా ప్రకటించింది. 

మామూలుగా అయితే.. టైప్1, టైప్2 డయాబెటిస్​లను ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా ట్రీట్ చేయొచ్చని, కానీ టైప్ 5 డయాబెటిస్​ను ఇన్సులిన్ ఇంజెక్షన్​తోనూ కంట్రోల్ చేయలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, కొంచెం కొంచెం ఇన్సులిన్​తోపాటు ఓరల్ మెడిసిన్స్​ఇస్తే ఫలితాలు ఉండొచ్చని భావిస్తున్నారు. దీనిని గుర్తించడం కష్టమని, ప్రాణాంతకంగా మారే ప్రమాదమూ ఎక్కువేనని చెబుతున్నారు. వచ్చే రెండేండ్లలో దీనిని గుర్తించే డయాగ్నస్టిక్ టెస్టులు, ట్రీట్​మెంట్లపై అధ్యయనాలను సైంటిస్టులు ముమ్మరం చేస్తున్నారు. తెలంగాణలోనూ ఇలాంటి కేసులు వస్తున్నట్టుగా డయాబెటిస్ నిపుణులు చెబుతున్నారు. అయితే, ఎన్ని కేసులు వస్తున్నాయన్నది మాత్రం ప్రస్తుతం పర్​ఫెక్ట్ లెక్కలు లేవని అంటున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల కేసులు..

టైప్ 5 డయాబెటిస్ కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నట్టు ఐడీఎఫ్ సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 2.5 కోట్ల మంది దాని బారిన పడ్డారని చెబుతున్నారు. ఆసియా, ఆఫ్రికా రీజియన్లలోనే ఈ కేసులు ఎక్కువగా వస్తున్నట్టు గుర్తించారు. రెండేండ్ల క్రితం వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి చెందిన శాస్త్రవేత్తలతో కలిసి ఐడీఎఫ్​ పరిశోధకులు ఓ స్టడీ నిర్వహించారు. పోషకాహారలోపం ఉన్న వాళ్లలో ఇన్సులిన్ స్రావాలు రావడం లేదని తేల్చారు. దానిని ఆదిలోనే తెలుసుకోవడం కూడా కష్టమేనని నిర్ధారించారు. దానిబారిన పడ్డాకే అది టైప్ 5 డయాబెటిస్​గా తేల్చడం సాధ్యమవుతున్నదని గుర్తించారు. 

ఆ స్టడీ ఆధారంగా ప్రపంచంలోని వివిధ దేశాల్లోనూ అధ్యయనాలు చేసిన ఐడీఎఫ్.. తాజాగా దానిని అధికారికంగా ప్రకటించింది. అంతకుముందు దానికి సంబంధించి కన్సెన్సస్​ (పరస్పర సమ్మతి) డాక్యుమెంట్లను ఈ ఏడాది జనవరిలో ఇండియాలోనే రూపొందించారు. ఆ డాక్యుమెంట్ల ఆధారంగా ఈ నెల 7న థాయిల్యాండ్​లోని బ్యాంకాక్​లో నిర్వహించిన సదస్సులో అఫీషియల్​గా పోషకాహారలోపం కారణంగా వచ్చే మధుమేహాన్ని టైప్5 డయాబెటిస్​గా నిర్ధారిస్తూ ప్రకటన చేశారు. టైప్ 5 డయాబెటిస్​ను తొలుత టైప్1 డయాబెటిస్​గా చాలా మంది భావించారని సైంటిస్టులు చెబుతున్నారు. టైప్ 1 డయాబెటిస్​లో ఎక్కువ మొత్తంలో బ్లడ్​ గ్లూకోజ్ లెవెల్స్ ఉన్నా కీటోన్​యూరియా, కీటోసిస్ డెవలప్​ కాదని, అదే టైప్​5లో ఇవి ఉత్పత్తి అవుతున్నాయని గుర్తించారు. 

1955లోనే గుర్తించినా.. 

టైప్​5 డయాబెటిస్​ను1955లోనే తొలిసారిగా జమైకాలో గుర్తించినట్టు సైంటిస్టులు చెబుతున్నారు. ఆ తర్వాత 1985లో దీనిని విభిన్నమైన మధుమేహంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) క్లాసిఫై చేసిందని, కానీ అది పోషకాహారలోపంతోనే వస్తుందని చెప్పేందుకు సరైన ఆధారాలను అప్పుడు సమర్పించలేకపోవడంతో 1999లో ఆ కేటగిరీ నుంచి తప్పించిందని గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత 2005 నుంచి సైంటిస్టులు దీనిపై పరిశోధనలు మొదలుపెట్టారు. ఐడీఎఫ్​కు చెందిన డాక్టర్​మెరిడిత్ హాకిన్స్ నేతృత్వంలోని సైంటిస్టుల బృందం ఐన్​స్టీన్ గ్లోబల్ డయాబెటిస్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేసి ఇండియా సహా వివిధ దేశాల్లో అధ్యయనాలు చేసి ఆధారాలు సమర్పించారు. దీంతో దానిని టైప్​5 కేటగిరీలో చేర్చారు. ఇప్పుడు డబ్ల్యూహెచ్​వో ఆమోదానికి పంపనున్నారు.

దేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరికి షుగర్​

మన దేశంలో టైప్​1, టైప్ 2 డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయని ఐడీఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. 2024లో ప్రతి ఏడుగురిలో ఒకరు డయాబెటిస్​తో బాధపడుతున్నారని పేర్కొంది. డయాబెటిస్​ కేసులపై 11వ ఎడిషన్​ అట్లాస్​ను ఐడీఎఫ్ విడుదల చేసింది. మన దేశంలో ప్రస్తుతం 8.98 కోట్ల మంది షుగర్​తో బాధపడుతుండగా.. 3,34,922 మంది డయాబెటిస్ కారణంగా చనిపోయినట్టు వెల్లడించింది.

 డయాబెటిస్​ కేసులు ఎక్కువున్న దేశాల్లో నెంబర్ 2 ఇండియానే అని తెలిపింది. 2050 నాటికి షుగర్​ కేసులు 75 శాతం పెరిగి.. 15.67 కోట్లకు చేరుకునే ప్రమాదం ఉందని పేర్కొంది. డయాబెటిస్ ఉన్నోళ్లలో దాదాపు 84 శాతం మందికి గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉందని తేల్చింది. పట్టణాల విస్తరణ, వలసలు, లైఫ్​స్టైల్ కారణంగా మధుమేహం కేసులు భారీగా పెరుగుతాయని తెలిపింది. డయాబెటిస్​పై ఒక్కొక్కరు సగటున రూ.9,500 దాకా ఖర్చు చేస్తున్నట్టు పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థపై డయాబెటిస్ భారం రూ.80 వేల కోట్ల దాకా ఉంటున్నదని తెలిపింది. కాగా, 2024లో 9.41 లక్షల మంది టైప్1 డయాబెటిస్​తో బాధపడుతుండగా.. అందులో 20 ఏండ్లలోపు వాళ్లే 3.01 లక్షల మంది ఉన్నారని  వెల్లడించింది.