![కారోబార్ను తొలగించాలని రెండు గ్రామాల ప్రజల తీర్మానం](https://static.v6velugu.com/uploads/2022/08/Resolution-of-the-people-of-two-villages-to-remove-Karobar_ZrMpmtN27e.jpg)
తాళం వేసిన వ్యక్తిపై పీఎస్లో కేసు నమోదు
ఏటూరునాగారం, వెలుగు: గోదావరి వరదలకు నష్టపోయిన తమకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం రూ.10వేలు అందకపోవడానికి గ్రామ పంచాయతీ ఆఫీసర్లే కారణమంటూ ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రాంనగర్లో గ్రామస్థులు జీపీ ఆఫీస్కు తాళం వేశారు. కారోబార్ ఇర్సవడ్ల రాజు తన బంధువులకే సాయం అందేట్టు ఆఫీసర్లకు తప్పుడు రిపోర్టులు పంపించారని రాంనగర్ గ్రామస్థులతో పాటు పంచాయతీ పరిధిలోని లంబాడీ తండా వాసులు ఆరోపించారు. ముంపు కారణంగా రెండు గ్రామాల నుంచి 72 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించిన ఆఫీసర్లు కేవలం 12 మందికే సాయం ఇచ్చారన్నారు.
దీనికి కారోబార్ కారణమని ఆయనను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఓ తీర్మాన పత్రం తయారు చేశారు. దాన్ని జీపీ ఆఫీస్ మెయిన్ డోర్కు అంటించి ఆఫీసర్లు ఎవరూ లోపలకు వెళ్లకుండా తాళం వేశారు. తమ సమస్యలు పరిష్కరించేంతవరకు గ్రామ పంచాయతీ ఆఫీసులో ఎవరూ డ్యూటీ చేయవద్దని భీష్మించుక్కూర్చున్నారు. కాగా జీపీ ఆఫీస్కు తాళం వేసిన మహేందర్తమను తిట్టాడంటూ.. సర్పంచ్రమాదేవి, కారోబార్ రాజు పీఎస్లో కంప్లయింట్చేశారు. దీంతో ఎస్సై రమేశ్కుమార్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.