
లక్నో: మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా వ్యవహరించాలని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మసీదులు, ఆలయాలు తదితర ప్రార్థన స్థలాల్లో 55 డెసిబెల్స్ కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలన్నారు. ఏ మతం లేదా మతపరమైన ప్రదేశాలల్లో లౌడ్ స్పీకర్ల అవసరం లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన గుర్తుచేశారు.
ఈ మేరకు రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులు, హోలీ వేడుకలపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. హోలీ వేడుకల సమయంలో అధిక సౌండ్ డీజేలను నిషేధించాలని అధికారులను ఆదేశించారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు తదితర కీలక ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే, పశువుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలన్నారు.
స్మగ్లర్లు, వాహన యజమానులు, పశువుల అక్రమ రవాణాకు సహకరించే పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయని, వెంటనే పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ వేసవిలో ప్రజలకు తాగు నీటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
8 ఏండ్లలో 210 కోట్ల మొక్కలు నాటాం..
రాష్ట్రంలో గత ఎనిమిదేండ్లలో 210 కోట్ల మొక్కలు నాటామని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. రాష్ట్రంలో అర్బనైజేషన్ వేగంగా పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అటవీ విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని చెప్పారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నాటిన 210 కోట్ల మొక్కలలో ఎన్ని బతికి ఉన్నాయో కూడా పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం నాటిన మొక్కల్లో దాదాపు 70 శాతం నుంచి 75 శాతం చెట్లు బతికే ఉన్నాయని ఆయన తెలిపారు. అలాగే, పలు స్వచ్ఛంద సంస్థలు నాటిన మొక్కల్లో 65 నుంచి 70 శాతం సర్వైవల్ రేటు ఉందని పేర్కొన్నారు.