బాలికపై అత్యాచారం కేసులో రిటైర్డ్​ జవాన్​కు 20 ఏండ్ల జైలు

బాలికపై అత్యాచారం కేసులో రిటైర్డ్​ జవాన్​కు 20 ఏండ్ల జైలు

సికింద్రాబాద్, వెలుగు: ఓ బాలికను లాడ్జ్​కు తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన రిటైర్డ్​ ఆర్మీ జవాన్​కు  20 ఏండ్ల జైలుశిక్ష,  రూ.20 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. సికింద్రాబాద్​లోని ఓ హోంలో ఆశ్రయం పొందుతున్న బాలిక.. సికింద్రాబాద్​ పాలికా బజార్​లో టైలరింగ్ నేర్చుకునేది. ఈ క్రమంలో 2017 జులై 24న  ఉదయం11 గంటల సమయంలో  టైలరింగ్  శిక్షణ కేంద్రానికి వెళుతూ పక్కనే ఉన్న బస్టాప్​లో కూర్చున్నది. 

అదే సమయంలో యాప్రాల్​లో నివాసముండే రిటైర్డ్​ ఆర్మీ జవాన్​ పెరియాటి శ్రీధరన్​(59) బైక్​పై అమ్మాయి వద్దకు వెళ్లి ‘‘ఆకలిగా ఉందా? భోజనం చేస్తావా?” అని అడిగాడు. బాలిక వద్దని చెప్పినా శ్రీధరన్​ ఆమెను బలవంతంగా ఓ హోటల్​కు తీసుకెళ్లి భోజనం పెట్టించాడు. అక్కడి నుంచి ఆమెను తన బైక్​పై లాడ్జ్​కు తీసుకెళ్లాడు. లాడ్జ్​ గదిలో ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 

తరువాత బాధితురాలిని బైక్ పై తీసుకువెళ్లి సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​ సమీపంలోని మనోహర్​ థియేటర్​ వద్ద వదిలిపెట్టాడు. ఈ విషయం ఎవరికైనా చెపితే చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. ఏడ్చుకుంటూ హోంకు వెళ్లిన బాధితురాలు రెండు రోజులుగా ముభావంగా ఉండడంతో హోంలోని హెల్త్​ వర్కర్  ఏమైందని ఆరా తీసింది. జరిగిన ఉదంతం గురించి బాధితురాలు వివరించింది. 

హోం ప్రతినిధులతో కలిసి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలిక తెలిపిన వివరాలతో నిందితుడు శ్రీధరన్​ను  2017 జులై 26న అరెస్టు చేశారు. అన్ని ఆధారాలతో నాంపల్లి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కేసును విచారించిన స్పెషల్​ కోర్టు జడ్జి పుష్పలత.. శ్రీధరన్ కు 20 ఏండ్ల కఠిన కారాగార  శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.